
ప్రభుత్వ పాఠశాల వద్ద మోకాళ్లపై ధర్నా
పాఠశాలలో తరగతులు తొలగించడంపై ఆందోళన
ధర్మవరప్పాడుతండ(జగ్గయ్యపేట): తమ పాఠశాలను తమ వద్దే ఉంచాలని డిమాండ్ చేస్తూ ధర్మవరప్పాడుతండ గ్రామ సర్పంచ్ గుగులోతు మణి ఆధ్వర్యంలో గ్రామస్తులు, తల్లిదండ్రులు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల వద్ద గురువారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పాఠశాలలో ఈ ఏడాది ఆరు, ఏడు, ఎనిమిది తరగతులు నిలుపుదల చేసి సమీప గ్రామంలోని జయంతిపురం పాఠశాలలో కలిపారన్నారు. ఇలా తరగతులను తొలగించటం వల్ల గ్రామంలోని విద్యార్థులు ఐదు కిలోమీమీటర్ల మేర వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు.
బస్సు సౌకర్యం కూడా లేదు..
జయంతిపురం వెళ్లాలంటే ఆటో, బస్సు సౌకర్యం లేదని దీని వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడతారని మరోసారి పునరాలోచన చేయాలని కోరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. ఫోన్లో ఎంఈవో చిట్టిబాబు మాట్లాడారు. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చాల్సి వస్తుందని తానేమి చేసేది లేదని చెప్పడంతో వారు వెనుదిరాగారు. గ్రామస్తులు మంగ్యానాయక్, సైదా నాయక్, జ్వాలా నాయక్, నారాయణ, గోపి, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.