గరికపాడు(జగ్గయ్యపేట): తమను వ్యవసాయశాఖలో విలీనం చేయాలంటూ జగ్గయ్యపేట మండలంలోని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (వీఏఏ)లు ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ ఢిల్లీరావును కోరారు. ఢిల్లీరావు గురువారం గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)ను సందర్శించారు. ఈ సందర్భంగా వీఏఏలు ఆయనను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి మాతృశాఖ వ్యవసాయ శాఖలోకి విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ/వార్డు సర్వేలకు తమను వినియోగిస్తుండటంతో రైతులకు సలహాలు, సూచనలు అందించలేకపోతున్నామని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున సర్వేల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అనంతరం కమిషనర్ ఢిల్లీరావు మాట్లాడుతూ వీఏఏల వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు.
హెచ్ఎంల ఉద్యోగోన్నతి కౌన్సెలింగ్లో గందరగోళం
మచిలీపట్నంఅర్బన్: ప్రధానోపాధ్యాయుల ఉద్యోగోన్నతి కౌన్సెలింగ్లో గందరగోళ పరి స్థితి ఎదురైంది. గురువారం ఉదయం ఎని మిది గంటలకు కౌన్సెలింగ్కు హెచ్ఎంలను పిలిచిన విద్యాశాఖ అధికారులు సాయంత్రం ఆరు గంటలకు సైతం ప్రక్రియను ప్రారంభించలేదు. కౌన్సెలింగ్ కోసం వచ్చిన ఉపాధ్యాయులు అప్పటి వరకు పడిగాపులు పడ్డారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో జెడ్పీ, మునిసిపల్ హై స్కూళ్లలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కల్పించేందుకు మచిలీపట్నంలోని లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యా శాఖ అధికారులు కౌన్సెలింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. సాంకేతిక సమస్యల పేరుతో కౌన్సెలింగ్ను ప్రారంభించకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో ఉపాధ్యాయులు అసహనానికి గురయ్యారు. ఎట్టకేలకు సాయంత్రం 6.30 గంటలకు మాన్యువల్ పద్ధతిలో అధికారులు కౌన్సెలింగ్ను చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో గుర్తించిన 95 ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీలకు 1:3 నిష్పత్తితో ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ చేశారు.
ఎలక్షన్ గోదాముకు పటిష్ట భద్రత
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా ఎలక్షన్ గోదాము వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని, సంబంధిత అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం సాధారణ తనిఖీల్లో భాగంగా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి ఏఎంసీ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరిచే జిల్లా ఎలక్షన్ గోదామును ఆయన గురువారం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. గోదాములోని సీసీ కెమెరాల పని తీరు, అగ్నిమాపక దళ పరికరాలు ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీచేశారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో కలెక్టర్ సంతకం చేశారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరిచిన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ గోదామును ఎప్పటికప్పుడు నిశితంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను అందిస్తున్నామని తెలిపారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ సలీమ్ పాల్గొన్నారు.
పర్యావరణ దినోత్సవంలో భాగస్వామ్యం కావాలి
సాక్షి, అమరావతి: ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో అన్ని ప్రభుత్వ శాఖలు భాగస్వామ్యంకా వాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. విజయవాడలోని మండలి ప్రధాన కార్యాలయంలో గురువారం సర్కులర్ ఎకానమీపై తదుపరి కార్యచరణ సమావేశం జరిగింది. కృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రధానంగా ఏపీఎస్ ఆర్టీసీ, రైల్వే, నేషనల్ హైవే విభాగాలు ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ప్లాస్టిక్ను అంతం చేద్దామనే నినాదంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. 30 విభాగాల్లో ఉత్పన్నమయ్యే వ్యర్థాల నిర్మూలనకు ఎటువంటి పద్ధతులు వినియోగిస్తున్నారనే దానిపై చర్చించారు.

వ్యవసాయ శాఖలో విలీనం చేయాలని వినతి

వ్యవసాయ శాఖలో విలీనం చేయాలని వినతి