
‘వేగ’కు ఎలాంటి సంబంధం లేదు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): స్థానిక అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ‘బంగారం స్కీమ్ పేరుతో జరిగిన మోసం’ కేసుకు, తమకు ఎటువంటి సంబంధం లేదని, తమ సంస్థలో ఎటువంటి చిట్టీలు కానీ, ఏజెంట్లు కానీ లేనే లేరని వేగ జ్యూవెలరీ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్కుమార్ వనమా పేర్కొన్నారు. గుణదల సమీపంలోని ఓ హోటల్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తన సోదరుడు సుధాకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు.
సీసీ కెమెరాలు చెక్ చేసుకోండి..
నవీన్కుమార్ మాట్లాడుతూ బంగారం స్కీమ్, చిట్టీల పేరుతో మోసం చేసిన కేసులో నిందితుడైన ముచ్చర్ల శ్రీనివాసరావు అనే వ్యక్తికి.. తమ సంస్థకు సంబంధం ఉన్నట్లుగా వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ముచ్చర్ల శ్రీనివాసరావు తమ ఏజెంట్ అంటూ.. వేగ జ్యూవెలరీకి వారు మాకు హామీ ఇచ్చారంటూ కొంతమంది బాధితులు చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలేనని వెల్లడించారు. తమను ఏ బాధితుడు వచ్చి కలవలేదని, తాము ఎవరికీ ఎటువంటి హామీలు కానీ, వివరణలు కానీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. కావాలంటే విజయవాడలోని తమ బ్రాంచి సీసీ కెమెరాలన్నింటినీ చెక్ చేసుకోవచ్చని తెలిపారు. నిజాయితీతో నడుచుకుంటూ ప్రజల విశ్వాసంతో ముందుకు వెళ్తున్న తమ సంస్థ కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయాలనే దురుద్దేశంతో ఎవరైనా నిరాధార ఆరోపణలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ సంస్థలో ఉన్న బంగారం స్కీములు కేవలం 11 నెలలు మాత్రమే ఉంటాయని, వాటికి కూడా తమ సంస్థ తరఫున అన్ని రశీదులు, ఆన్లైన్ లావాదేవీలు ఉంటాయని వివరించారు. తమకు ఎటువంటి ఏజెంట్లు కూడా లేరని ఈ విషయాన్ని గమనించి, ప్రజలు ఎవరి చేతిలో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోలీసులు త్వరితగతిన ఈ కేసును ఛేదించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
సంస్థకు ఎటువంటి ఏజెంట్లు లేరు
నిరాధార ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
వేగ జ్యూవెలరీ మేనేజింగ్ డైరెక్టర్
నవీన్కుమార్ వనమా