మహా మండపంలో షాపులకు బహిరంగ వేలం | - | Sakshi
Sakshi News home page

మహా మండపంలో షాపులకు బహిరంగ వేలం

May 30 2025 1:17 AM | Updated on May 30 2025 1:17 AM

మహా మండపంలో షాపులకు బహిరంగ వేలం

మహా మండపంలో షాపులకు బహిరంగ వేలం

11, 12 తేదీల్లో నిర్వహణకు దుర్గగుడి అధికారుల ఏర్పాట్లు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం మహా మండపం 5వ అంతస్తులో పూజా సామగ్రి, ప్లాస్టిక్‌ ఆట వస్తువులను విక్రయించే 19 షాపులకు బహిరంగ వేలం నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన పనులను దేవస్థాన లీజెస్‌ విభాగం అధికారులు సిద్ధం చేశారు. జూన్‌ 11, 12వ తేదీన మహా మండపం ఆరో అంతస్తులో వేలం నిర్వహించనున్నారు. 2022లో అప్పటి ఈవో భ్రమరాంబ మహామండపంలో పూజా సామగ్రిని విక్రయించేందుకు షాపులకు బహిరంగం వేలం నిర్వహించారు. అయితే భక్తులు కొండపైకి ఘాట్‌రోడ్డు, లిఫ్టు మార్గంతో పాటు మెట్ల మార్గం ద్వారా చేరుకుంటున్నారు. కేవలం మహా మండపం మెట్ల మార్గం ద్వారా వచ్చే భక్తులకు మాత్రమే 5వ అంతస్తులోకి మళ్లించడంతో వారికే పూజా సామగ్రి విక్రయించే అవకాశం ఉండేది. వేలాది రూపాయలు అద్దెలు చెల్లించినా వ్యాపారాలు అంతగా లేకపోవడంతో తమ దుకాణాలను కొండ దిగువకు మార్చాలని దుకాణదారులు ఈవోకు మొర పెట్టుకున్నారు. దీంతో కనకదుర్గనగర్‌లో దేవస్థానం షాపులను నిర్మించి అద్దె బకాయిలు చెల్లించిన వారికి కేటాయింపు చేస్తామని ప్రకటించింది. దీంతో పలువురు వ్యాపారులు బకాయిలు చెల్లించి కనకదుర్గనగర్‌లో షాపులను దక్కించుకున్నారు.

గతేడాది గోశాల వద్దకు..

గత ఏడాది దసరా ఉత్సవాలకు ముందు కనకదుర్గనగర్‌లోని షాపులను తిరిగి తొలగించి గోశాల ఎదుట కేటాయింపు చేశారు. అయితే ఇటీవల దుర్గగుడి ఈవోగా బాధ్యతలు నిర్వహించిన దేవదాయశాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ గోశాల వద్ద ఉన్న దుకాణాలను తొలగించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న దుకాణాలతో పాటు మహా మండపం 5వ అంతస్తులో ఉన్న దుకాణాలకు టెండర్‌ నిబంధనల ప్రకారం మూడేళ్ల కాల పరిమితి పూర్తి కానుంది. దీంతో వ్యాపారులు తమ దుకాణాలను తిరిగి రెన్యూవల్‌ చేయించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

మరోసారి ఐదో అంతస్తుకు..

మహా మండపం 5వ అంతస్తుకు తిరిగి దుకాణాలను తరలిస్తున్నట్లు లీజెస్‌ విభాగం అధికారులు వ్యాపారులకు సూచించడంతో వారు ఆందోళనకు గురయ్యారు. గతంలో వ్యాపారాలు సరిగా లేకనే కొండ కిందకు దిగామని, తిరిగి మహా మండపంలోకి పంపడం సరికాదని బహిరంగంగానే పేర్కొంటున్నారు. మరో వైపున గోశాల వద్ద షాపులను కేటాయింపులకు దేవస్థాన ఇంజినీరింగ్‌ అధికారులతో పాటు కీలక అధికారులకు లక్షలాది రూపాయలు ముట్టజెప్పినట్లు బహిరంగంగానే పేర్కొంటున్నారు. అయితే కొంత మంది కూటమి నేతలు తమ దుకాణాలను బహిరంగ వేలం నిర్వహించకుండా ఉండేందుకు ముఖ్య నేతల చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement