ఆధునిక టెక్నాలజీతో నేరాలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

ఆధునిక టెక్నాలజీతో నేరాలకు చెక్‌

May 30 2025 1:17 AM | Updated on May 30 2025 1:17 AM

ఆధునిక టెక్నాలజీతో నేరాలకు చెక్‌

ఆధునిక టెక్నాలజీతో నేరాలకు చెక్‌

ఏలూరు రేంజ్‌ ఐజీపీ అశోక్‌కుమార్‌

కోనేరుసెంటర్‌: ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి జిల్లాలో నేరాల నియంత్రణ చేస్తున్నట్లు ఏలూరు రేంజ్‌ ఐజీపీ జీవీజీ అశోక్‌కుమార్‌ తెలిపారు. గురువారం ఆయన కృష్ణాజిల్లా పోలీసు కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ఆర్‌. గంగాధరరావు తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత డిస్ట్రిక్‌ క్రైం రికార్డ్‌ బ్యూరో (డీసీఆర్‌డీ)ని సందర్శించారు. సిబ్బంది పనితీరును పరిశీలించారు. రికార్డుల నిర్వహణపై ఆరా తీశారు. అనంతరం స్పెషల్‌బ్రాంచ్‌ను సందర్శించారు. అక్కడి నుంచి ఐటీ కోర్‌, ఫింగర్‌ ప్రింట్‌, హోంగార్డ్స్‌, డాగ్‌స్క్వాడ్‌ విభాగాలలో తనిఖీలు చేశారు. ఆయా విభాగాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే నేరాల నియంత్రణకు ఉపయోగిస్తున్న డ్రోన్‌ కెమెరాల పనితీరును స్వయంగా పరిశీలించారు. అనంతరం ఎస్పీతో కలిసి కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.

పనితీరు సంతృప్తికరం..

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణకు డ్రోన్‌ కెమెరాలు విశిష్ట కృషి చేస్తున్నట్లు చెప్పారు. వాటి వినియోగం ద్వారా నేరాలను చాలా వరకు తగ్గించగలుగుతున్నట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచి, స్థానికుల సహకారంతో నాలుగు వేలకు పైగా సీసీ కెమెరాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయగలిగామన్నారు. వాటి ద్వారా అనేక కేసులకు సంబంధించిన దర్యాప్తును మరింత వేగవంతం చేయగలుగుతున్నామని చెప్పారు

గంజాయిపై ఉక్కుపాదం..

రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులతో పాటు, బారికేడ్‌లు, రేడియం స్టిక్కర్లతో కూడిన డ్రమ్ములను ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ప్రదేశంలో నిఘాను ఏర్పాటు చేసి గంజాయి విక్రేతల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, గంజాయి వినియోగాన్ని కూకటివేళ్లతో పెకలించేలా చర్యలు చేపట్టటం జరుగుతుందన్నారు. అలాగే మత కల్లోలాలు రెచ్చగొట్టేలా, మత సామరస్యానికి భంగం వాటిల్లేలా వ్యవహరించే వ్యక్తుల చర్యలను అరికట్టేందుకు స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగం ద్వారా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి మతపరమైన గొడవలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. అడిషనల్‌ ఎస్పీ బి. సత్యనారాయణ, బందరు డీఎస్పీ సీహెచ్‌ రాజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement