
విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రి మృతి
కోనేరుసెంటర్: కరెంట్ షాక్కు గురై ఓ తాపీ మేస్త్రి మృతి చెందాడు. ఈ ఘటనపై చిలకలపూడి పోలీస్స్టేషన్లో సోమవారం కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరు మండలం కోకవానిపాలెం గ్రామానికి చెందిన తటవర్తి వెంకటనరసయ్య (26) తాపీ పని చేస్తుంటాడు. ఏడాది క్రితం భార్య చనిపోయింది. ఆరు నెలల క్రితం కుమార్తె ప్రమాదవశాత్తు చనిపోయింది. ప్రస్తుతం నరసయ్య ఒంటరిగా జీవిస్తున్నాడు. తాపీ పనులు చేసుకునే నరసయ్య రోజూలాగానే వలందపాలెంలో ఓ నూతన భవన నిర్మాణం పనికి వెళ్లాడు. రెండో అంతస్తులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు హై టెన్షన్ వైర్లు తగిలి నరసయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతుని వివరాలు నమోదు చేసుకున్నారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.