ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో పకడ్బందీగా నీట్ నిర్వహించాలని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నీట్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 353 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష కొనసాగనుండగా, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. రెండు పాస్ ఫొటోలు, అడ్మిట్ కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో వేణు, డీఎస్పీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.


