చెన్నూర్: చెన్నూర్లోని మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థి పెద్దపోలు నాగవర్థన్ అదృశ్యం కథ సుఖాంతమైంది. విద్యార్థి అదృశ్యంపై తల్లిదండ్రులు స్వరూప, సమ్మగౌడ్, కుటుంబ సభ్యులు పాఠశాల ఎదుట గురువారం ఆందోళన చేపట్టారు. బాలుడు క్షేమంగా రావడంతో స్థానిక పోలీసుస్టేషన్లో తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు వివరాలు వెల్లడించారు. నాలుగు రోజులు క్రితం నాగవర్థన్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో చెన్నూర్లోని మహాంకాళివాడలో నివాసం ఉంటున్న తండ్రి సమ్మగౌడ్ వచ్చి తీసుకెళ్లాడు. ఆరోగ్యం కుదుట పడడంతో బుధవారం ఉదయం 10:36 గంటలకు పాఠశాలలో అప్పగించాడు. సాయంత్రం 7గంటలకు పాఠశాల యాజమాన్యం తండ్రికి ఫోన్ చేసి విద్యార్థి పాఠశాలలో లేడని చెప్పారు. తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి సిబ్బందిని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యహరించారని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం పాఠశాల, పరిసర ప్రాంతాల సీసీ కెమెరాలను పరిశీలించి నాగవర్థన్ టాటా ఎస్లో మంచిర్యాలకు వెళ్లినట్లు గుర్తించారు. మధ్యాహ్నం సమ్మగౌడ్కు అతడి బంధువు ఫోన్ చేసి నాగవర్థన్ కరీంనగర్లో తన వద్ద ఉన్నాడని చెప్పాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు వెళ్లి తీసుకొచ్చారు. బాలుడిని విచారించగా చదువు ఇష్టం లేక వెళ్లిపోయినట్లు చెప్పాడు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సమావేశంలో ఎస్సైలు శ్యాంపటేల్, సుబ్బారావు పాల్గొన్నారు.


