ఆసిఫాబాద్: దివ్యాంగులకు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ డేవిడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్లో బుధవారం అధికారులు, దివ్యాంగుల హక్కుల కమిటీ సభ్యులతో హక్కులు, సౌకర్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ చేయూత పింఛన్ల పంపిణీ కేంద్రాల వద్ద దివ్యాంగులకు తాగునీరు, నీడ, ప్రత్యేక టాయిలెట్ వసతితో పాటు సదరం శిబిరాల వద్ద వీల్చైర్లు, హెల్పర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. దివ్యాంగులకు కేటాయించిన రిజర్వేషన్ ప్రకారం పథకాల్లో అర్హులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, అనుచితంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతీ మండలంలోని అధికారులతో దివ్యాంగుల సమస్యలపై సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీఆర్డీవో దత్తారావు, దివ్యాంగుల హక్కుల సమితి ప్రతినిధులు ఇస్లాంబిన్ హసన్, గాలెం వెంకటేశ్, ఇప్ప రవి, శంకర్ పాల్గొన్నారు.
ఇంటి వద్దకే రాములోరి
కల్యాణ తలంబ్రాలు
కాగజ్నగర్టౌన్: భద్రాచలంలో నిర్వహించే శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవ పవిత్ర తలంబ్రాలు, ప్రసాదాన్ని రాష్ట్రంలోని భక్తుల ఇళ్ల వద్దకే చేరవేసేందుకు తెలంగాణ పోస్టల్శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని కాగజ్నగర్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ సిరికొండ సతీశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతరాలయ అర్చన ప్యాకేజీ రూ.450 చెల్లిస్తే కల్యాణ తలంబ్రాలతోపాటు ఒక ముత్యం, కుంకుమ, మిశ్రీ, కాజు గింజలు అందిస్తారని పేర్కొన్నారు. ముత్యాల తలంబ్రాల ప్యాకేజీ రూ.151 చెల్లిస్తే కల్యాణ తలంబ్రాలు, పవిత్ర ముత్యం అందిస్తారన్నారు. భక్తులు సమీప పోస్టాఫీసుల్లో రుసుం చెల్లించి బుక్ చేసుకోవచ్చన్నారు. బుకింగ్ సమయంలో భక్తులు పూర్తి చిరునామా, ఫోన్ నంబర్ స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. ప్రసాదం కోసం ఈ నెల 25తేదీలోగా బుకింగ్ చేసుకోవాలని కోరారు. వృద్ధాప్యం, అనారోగ్యం, దూరభారం, రద్దీ, ఇతర కారణంగా భద్రాచలం వెళ్లలేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


