బాధ్యతలు
స్వీకరించిన
ఆసిఫాబాద్: ఇటీవల ఎన్నికై న ఆసిఫాబాద్ పాలకవర్గ సభ్యులు జిల్లా కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి సమక్షంలో అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్తోపాటు కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, సాలంబిన్ అహ్మద్, కుర్సెంగ బాలకృష్ణ, దూడల లక్ష్మి, గుబుడె నాగుబాయి, జేబాషేక్ మున్సిపల్ కమిషనర్ గజానంద్ పర్యవేక్షణలో రిజిస్టర్లో సంతకాలు చేశారు. తొలుత చాంబర్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ, రాజంపేట పంచాయతీని బీఆర్ఎస్ కై వసం చేసుకుందని తెలిపారు. ఆసిఫాబాద్ మేజర్ పంచాయతీకి తాను సైతం సర్పంచుగా సేవలందించానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జిల్లా కేంద్రంలో రూ.35 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఆస్పత్రి, మెడికల్ కాలేజీ, పిల్లల పార్కు ఇతర అభివృద్ధి చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని అన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను ఎమ్మెల్యే కోవ లక్ష్మి, పార్టీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు శాలువాలు, పూలదండలతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మర్సోకోల సరస్వతి, బీఆర్ఎస్ నాయకులు అహ్మద్, నిసార్ తదితరులు పాల్గొన్నారు.
ఫొటోల రగడ
ఆసిఫాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ చాంబర్లో నాయకుల ఫొటోలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫొటోలు ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సోషల్ మీడియాలో అభ్యంతరం తెలిపారు. దీనిపై స్పందించిన బీఆర్ఎస్ నేతలు మంచిర్యాల కార్పొరేషన్లో అక్కడి ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావుతో కూడిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఎమ్మెల్యేల ఫొటోలపై అభ్యంతరం తెలపడం సరికాదని వారు పేర్కొన్నారు.


