ముగిసిన సీసీఐ కొనుగోళ్లు
గడిచిన వారంలోనే 69,155 క్వింటాళ్ల పత్తి సేకరణ ఇంకా చేలలోనే పంట గడువు ముగియడంతో ఆందోళనలో దూది రైతులు
దహెగాం: సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు శుక్రవారంతో ముగిశాయి. ఓ వైపు ఇంకా పత్తి చేలలోనే ఉండగా, సీసీఐ గడువు పెంచలేదు. దీంతో మిగిలి న పంటను ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ప్రశ్ని స్తున్నారు. మొదట ఈ నెల 20న గడువు ముగిసింది. ప్రజాప్రతినిధులు, రైతుల నుంచి గడువు పెంచాలని డిమాండ్ రావడంతో స్పందించిన అధి కారులు వారం రోజుల పాటు గడువు పెంచారు.
భారీ వర్షాలకు ఆలస్యం
జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో 3.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అక్టోబర్లో భారీ వర్షాలు కురవడంతో పత్తితీత పనులు ఆలస్యమయ్యాయి. చాలా ప్రాంతాల్లో నవంబర్ నుంచి పనులు మొదలు పెట్టారు. జిల్లావ్యాప్తంగా కూలీల కొరత ఉండటంతో ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూలీలు వలస వచ్చారు. రైతులు వారికి షెల్టర్ కల్పించి పత్తితీత పనులు చేయించుకున్నారు. అయినా ఇప్పటివరకు పూర్తికాలేదు. జిల్లాలో 23 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు చేపట్టగా, ఈ నెల 20 వరకే పత్తి కొనుగోళ్లు చేస్తామని ఆ తర్వాత నిలిపివేస్తామని సీసీఐ ప్రకటించింది. దీనిపై రైతులు ఆందోళన చెందారు. 30శాతం వరకు పంట చేలలోనే ఉండటంతో ‘సాక్షి’లో ‘గడువు గండం..!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, ఎంపీ స్పందించారు. రైతులు మార్చి 15 వరకు పెంచాలని డిమాండ్ చేసినా అధికారులు వారం రోజుల గడువు మాత్రమే ఇచ్చారు. దీంతో అన్నదాతలకు కొంతమేర ఊరట కలిగింది. ఇంటిల్లిపాది వెళ్లి పత్తితీత పనుల్లో నిమగ్నమయ్యారు. కూలీలకు కిలోకు రూ.20 నుంచి రూ.25 వరకు చెల్లించారు. మరో 15 శాతం వరకు పత్తి తీయాల్సి ఉందని రైతులు పేర్కొంటున్నారు. మిగిలిన పంటను ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుందని వాపోతున్నారు. సీసీఐ మరోసారి గడువు పెంచే అవకాశాలు లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
13,61,771 క్వింటాళ్లు కొనుగోలు
జిల్లావ్యాప్తంగా 23 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ద్వారా ఇప్పటివరకు 13,61,771 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. ప్రైవేటులో 39,910 క్వింటాళ్లను సేకరించారు. ఈ నెల 20 వరకు సీసీఐ కొనుగోళ్లు నిలిపేవరకు 12,92,616 కొనుగోలు చేయగా, ప్రైవేటులో 34,118 వేల క్వింటాళ్లను కొనుగోలు చేశారు. గడువు పెంచిన తర్వాత వారం రోజుల్లో సీసీఐ ద్వారా ఏకంగా 69,155 క్వింటాళ్లు సేకరించడం గమనార్హం. ప్రైవేటులోనూ 5,792 క్వింటాళ్లను కొనుగోలు చేశారు. నష్టపోయే అవకాశం ఉన్నందున మార్చి 15 వరకు గడువు పెంచాలని జిల్లా రైతులు కోరుతున్నారు.


