డ్రైవర్లకు స్పష్టమైన కంటిచూపు కీలకం
కాగజ్నగర్టౌన్: వాహనాలు నడిపే డ్రైవర్లకు స్పష్టమైన కంటిచూపు అత్యంత కీలకమని ఎస్పీ నితిక పంత్ అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం హెచ్ఆర్డీ భవనంలో రోడ్డు ప్రమాదాలు నివారణకు పోలీస్ శాఖ చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెడికల్ అసోసియేషన్ సౌజన్యంతో లారీ, ట్రక్ డ్రైవర్లు, క్లీనర్లకు ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమైన కంటిచూపు లోపాన్ని ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకోవాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం తాగి నడుపొద్దన్నారు. అధికవేగాన్ని నివారిస్తూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. ర్యాష్, నిర్లక్ష్యం, హెవీలోడ్ డ్రైవింగ్ చేయొద్దన్నారు. వాహనదారులు బాధ్యతగా మెలగాలన్నారు. అనంతరం పట్టణంలోని డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. కార్యక్రమంలో మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, డాక్టర్ వెంకటేశ్వర్, టౌన్ సీఐ ప్రేంకుమార్, ఎస్సైలు సుధాకర్, రాజు, డ్రైవర్లు పాల్గొన్నారు.
భద్రత మరింత బలోపేతం
కాగజ్నగర్టౌన్: సీసీ కెమెరాలతో భద్రత మరింత బలోపేతం అవుతుందని ఎస్పీ నితిక పంత్ అన్నారు. కాగజ్నగర్ పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శుక్రవారం ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రతను పతిష్టం చేయాలనే లక్ష్యంతో కాగజ్నగర్ పోలీసులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సౌజన్యంతో 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బస్టాండ్, ఎన్టీఆర్ చౌరస్తా, సిర్పూర్ ప్రధాన రహదారి, తదితర ప్రాంతాల్లో నిఘా పెంచుతున్నామన్నారు. కార్యక్రమంలో సీఐ ప్రేంకుమార్, ఎస్సైలు, మెడికల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.


