ముంచుకొస్తున్న గడువు
మున్సిపాలిటీల్లో పేరుకపోయిన పన్నులు ఎన్నికల ప్రక్రియతో వసూళ్లలో జాప్యం మిగిలింది నెల రోజులు మాత్రమే మార్చి 31 వరకు పూర్తి చేస్తామంటున్న బల్దియా అధికారులు
ఆసిఫాబాద్అర్బన్: మున్సిపాలిటీల్లో పన్ను వసూలుకు గడువు ముంచుకొస్తోంది. ఫిబ్రవరి ముగుస్తుండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 32 రోజుల గడువు మాత్రమే మిగిలిఉంది. అయినా జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికల హడావుడితో అధికారులు, సిబ్బంది పన్నుల వసూళ్లపై దృష్టి సాధించలేకపోయారు. దీంతో బల్దియాల్లో బకాయిలు పేరుకుపోయాయి.
బకాయిలపై దృష్టి ఏది..?
జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లోనూ బకాయిల వ సూళ్లపై అధికారులు దృష్టి సాధించడం లేదనే ఆరో పణలు ఉన్నాయి. ఈ కారణంగా భారీగా పన్నులు పేరుకుపోతున్నాయి. అధికారులు ఇళ్లకు వెళ్లగానే రాజకీయ అండదండలతో ఫోన్లు రావడంతో వెనుదిరుగుతున్నారు. పేదలు మాత్రం రూ.1000 పెండింగ్ ఉన్నా ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పట్టణ ప్రజలు సహకరించాలి
ఇటీవల మున్సిపల్ ఎన్నిక ల దృష్ట్యా మున్సిపాలిటీలో పన్నుల వసూళ్లు కాస్త నెమ్మదిగా కొనసాగాయి. అలాగే గ్రామపంచాయతీ రికార్డులో ఉన్న పేర్లు, వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తూ పన్ను వసూళ్లు చేయడంతో జాప్యం జరిగింది. మార్చి 31లోగా డిమాండ్కు తగినట్లుగా వసూళ్లు పూర్తి చేస్తాం. పట్టణ ప్రజలు పన్నులు సకాలంలో చెల్లించి అధికారులకు సహకరించాలి.
– గజానంద్, మున్సిపల్ కమిషనర్
ఆసిఫాబాద్ బల్దియాలో 50శాతమే..
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. 2025– 2026 ఆర్థిక సంవత్సరంలో పన్నుల డిమాండ్ రూ.1.02 కోట్లు ఉండగా, ఇప్పటివరకు రూ.50 లక్షలు(50శాతం) మాత్ర మే వసూలయ్యాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ నూతనంగా ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇదివరకు గ్రామ పంచాయతీలో ఉన్న యజమానుల వివరాలను ఆన్లైన్ చేసుకోవడం, తర్వాత పన్ను వసూళ్లు చేయడం ప్రక్రియతో కాస్త ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే ఆన్లైన్ విధానానికి పూర్తిస్థాయిలో సాంకేతిక పరికరాలు అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. మార్చి నెలాఖరు నాటికి బకాయి వసూళ్లు పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ముంచుకొస్తున్న గడువు


