ఆశ్రమ విద్యార్థులకు నాణ్యమైన విద్య
ఆసిఫాబాద్రూరల్: ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన వసతి, విద్యనందించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికలు, కాగజ్నగర్లోని బాలుర ఆశ్రమ పాఠశాలలను మంగళవారం తనిఖీ చేశారు. పీవో మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. వసతి గృహాల పరిసరాలు, వంటగది, స్టోర్ రూం, తాగునీరు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎలాంటి సమస్య ఉన్నా పల్స్ యాప్లో నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


