ప్రజావాణికి వినతుల వెల్లువ
ఆసిఫాబాద్అర్బన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నెల రోజులుగా ప్రజావాణి రద్దు కాగా సోమవారం పునఃప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. కలెక్టర్ కె.హరిత అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి వివిధ మండలాలకు చెందిన వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని జిల్లా కేంద్రంలో ని సందీప్నగర్కు చెందిన బోయని నగేశ్ దరఖాస్తు అందించాడు. వ్యవసాయ చేనులో బోరు మంజూ రు చేయాలని జైనూర్ మండలం పార గ్రామానికి చెందిన సిడ్మారావు విన్నవించాడు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ఎల్కరి పద్మ, అదే మండలం రాళ్లపేట గ్రా మానికి చెందిన రెడ్డి ఉమారాణి, వంకులం గ్రామానికి చెందిన ఆత్మకూరి రజిత వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. గ్రామంలో బుద్ధుడి మందిర నిర్మాణానికి అక్రమంగా చందాలు వసూలు చేస్తున్నారని కౌటాల మండలం తాటినగర్కు చెందిన దుర్గం శరత్ చంద్ర ఫిర్యాదు చేశాడు. నర్సింగ్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ కింద ఉపాధి కల్పించాలని ఆసిఫాబాద్ పట్టణం జన్కాపూర్కు చెందిన అనసూర్య అర్జీ అందించింది. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణికి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. వినతులను సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు.


