తడి పొడి.. నిర్వహణ కొరవడి
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన సెగ్రిగేషన్ షె డ్లు, వైకుంఠధామాలు, డంపుయార్డ్లు నిరుపయోగంగా మారుతున్నాయి. ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో ఈజీఎస్ పనుల్లో భాగంగా వైకుంఠధామాలు నిర్మించారు. కానీ, నేటి వరకు వాటిని వినియోగించకపోవడంతో అందులో పిచ్చిమొక్కలు, చెట్లు మొలకెత్తి గోడలు బీటలు వారుతున్నాయి.
రూ.కోట్లు వెచ్చించి నిర్మించినా..
జిల్లా వ్యాప్తంగా ఉన్న 315 గ్రామపంచాయతీల్లోని పల్లెలను పరిశుభ్రంగా మార్చడంతో పాటు చెత్త నుంచి సంపద తయారీకి ప్రభుత్వం నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠధామాలు చాలాచోట్ల నిరుపయోగమయ్యాయి. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సేంద్రియ ఎరువు తయారు చేసి గ్రామపంచాయతీలకు ఆదాయం సమకూర్చేలా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్ల రేకులు కొన్ని చో ట్ల లేచిపోయాయి. మరికొన్ని చోట్ల నిర్వహణ లేక అస్తవ్యస్తంగా మారాయి. సెగ్రిగేషన్ షెడ్లకు రూ.2.50 లక్షలు, వైకుంఠధామాలకు రూ.12.60 ల క్షలు వెచ్చించి నిర్మించి నాలుగైదేళ్లయినా నేటి వర కూ వాడకంలో లేకపోవడం గమనార్హం. రూ.కోట్లు వెచ్చించి నిర్మించి నిరుపయోగంగా వదిలేశారు.
ఏళ్లు గడుస్తున్నా నిరుపయోగమే..
ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో ఒక వైకుంఠధా మం, సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు అవి నిరుపయోగంగానే దర్శనమిస్తున్నాయి. కొన్ని గ్రామపంచాయతీల్లో ఊరికి దూరంగా ఉండటంతో వెళ్లేందుకు దారి లేక, వానాకాలం అటు వైపు చూసేవారే కరువయ్యారు. వైకుంఠధామాలు నిర్మించినా నీరు, కరెంట్ సౌకర్యం కల్పించలేదు. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. నాసిరకం పనులు చేపట్టగా ఇప్పటికే గోడలు బీటలు వారి కూలిపోయే పరిస్థితి ఉంది.


