
‘కార్మికులకు నిత్యం అందుబాటులో ఉంటాం’
రెబ్బెన(ఆసిఫాబాద్): కార్మికులకు నిత్యం అందుబాటులో ఉంటామని ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ ఉపాధ్యక్షుడు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కాంపెల్లి సమ్మయ్య అన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓసీపీలో శుక్రవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి బీఐఎఫ్ఆర్లోకి వెళ్లిన సమయంలో ప్రభుత్వంతో మాట్లాడి రూ.400 కోట్లు ఇప్పించిన ఘనత ఐఎన్టీయూసీదని అన్నారు. కార్మికుడికి సొంతింటి పథకం తప్పకుండా ఇప్పిస్తామని, పెర్క్స్పై ఐటీ రద్దు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆపరేటర్ల పదోన్నతి అంశాన్ని సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామన్నారు. కాంట్రాక్టు కార్మికులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్బాబు దృష్టికి జనక్ప్రసాద్ తీసుకెళ్లారని తెలిపారు. టీబీజీకేఎస్ నాయకులు గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీలో ఉండకుండా, ఏఐటీయూసీ గెలిచేలా పనిచేశారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్, సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సంగెం ప్రకాష్రావు, రామారావు, వీరస్వామి, ఏరియా కార్యదర్శులు మాధవకృష్ణ, నారాయణ, శ్రీనివాస్, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి గట్టయ్య, ఫిట్ కార్యదర్శులు తిరుపతి, భీమేశ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.