
● ప్రజావాణిలో గోడు వెల్లబోసుకున్న అర్జీదారులు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వినతులు వెల్లువలా వచ్చాయి. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తరలివచ్చి అధికారుల ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకున్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్నంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇంటి వద్ద మురుగు కాలువను ఆక్రమించడంతో మురుగు నీరంతా ఇంట్లోకి చేరుతుందని, ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కాగజ్నగర్ పట్టణం ఇర్ఫాన్నగర్కు చెందిన పర్రె శ్రీకాంత్ కోరాడు. తన తండ్రి పేరిట ఉన్న భూమిని ఇతరులు ఆక్రమించారని, న్యాయం చేయాలని కౌటాల మండలం కనికి గ్రామానికి చెందిన మడే లక్ష్మయ్య దరఖాస్తు చేసుకున్నాడు. ఆసిఫాబాద్ మండలం చోర్పల్లి గ్రామ శివారులోని భూమిని ఆక్రమించారని మిట్ట మల్లన్న ఫిర్యాదు చేశాడు. సింగరేణి ఉపరితల గనిలో తిర్యాణి మండలం దేవాయిగూడ గ్రామంలోని ఇళ్లను కోల్పోయామని నష్టపరిహారం ఇచ్చి ఉపాధి చూపాలని రెబ్బెన మండలం గోలేటిలోని గౌతమ్నగర్కు చెందిన బోయిని సురేందర్ దరఖాస్తు చేసుకున్నాడు. పోస్టాఫీస్లో డిపాజిట్ చేసిన రూ.లక్ష ఇప్పించాలని కాగజ్నగర్ పట్టణంలోని నజ్రూల్నగర్కు చెందిన కవిత మండల్ అర్జీ సమర్పించింది. తమ గ్రామానికి తాగునీటిని అందించాలని సిర్పూర్(యూ) మండలం రాఘవాపూర్ పంచాయతీ పరిధిలోని మారుగూడ గ్రామస్తులు కోరారు. ఇళ్ల పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు తొలగించాలని వాంకిడి మండల కేంద్రంలోని కేబీ నగర్ కాలనీవాసులు విన్నవించారు. తన కుమార్తె పిడుగుపాటుతో మరణించిందని, ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందించాలని బెజ్జూర్ మండలం పోతెపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య కోరాడు.
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, పక్కన అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ఆలయ స్థలానికి హద్దులు నిర్ణయించాలి
జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ వీరాంజనేయ స్వామి ఆలయ స్థలాన్ని సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు ఆలయ కమిటీ ప్రతినిధులు వినతిపత్రం అందించారు. స్థలం ఆక్రమణకు గురవుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆలయానికి తూర్పు వైపు నుంచి వెళ్తున్న రహదారికి హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి వెంకటేశ్వర్లు, కార్యదర్శి గుండా వెంకన్న, కోశాధికారి పిన్నా వివేక్, డాక్టర్ మధు, రాధాకృష్ణచారి, కృపాల్, ప్రకాశ్గౌడ్ తదితరులు ఉన్నారు.