విచారణ వేగవంతం | - | Sakshi
Sakshi News home page

విచారణ వేగవంతం

May 26 2025 9:56 AM | Updated on May 26 2025 9:56 AM

విచారణ వేగవంతం

విచారణ వేగవంతం

● పులిని హతమార్చిన కేసులో 30 మంది అరెస్టు ● మరికొంత మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. ● ఇకనైనా వేటగాళ్ల తీరు మారేనా..?

పెంచికల్‌పేట్‌(సిర్పూర్‌): పెంచికల్‌పేట్‌ మండలం ఎల్లూర్‌ అటవీ ప్రాంతంలో విద్యుత్‌ తీగలతో ఈ నెల 15న పెద్దపులిని హతమార్చిన కేసు విచారణలో అటవీశాఖ అధికారులు వేగం పెంచారు. పెద్దపులి చర్మం, అవశేషాలు స్వాధీనం చేసుకున్న తర్వాత పెద్ద సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పెంచికల్‌పేట్‌ మండల కేంద్రంతోపాటు అగర్‌గూడ, ఎల్లూర్‌, కోయచిచ్చాల, దహెగాం మండలం చిన్నరాస్పెల్లి, అమరగొండ, గెర్రె, ఖర్జీ గ్రామాలకు చెందిన 30 మంది ఆసిఫాబాద్‌ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరికొంత మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో ఆరు నుంచి ఎనిమిది మందిని అనుమానితులను రిమాండ్‌కు తరలించే యోచనలో అటవీశాఖ ఉన్నట్లు సమాచారం.

పెంచికల్‌పేట్‌ రేంజ్‌లో కే8 అడ్డా..

ఎల్లూర్‌ అటవీ ప్రాంతంలో వేటగాళ్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన పెద్దపులిని చారలు, ఇతర ఫొటోల ఆధారంగా కే 8గా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చిన తర్వాత స్పష్టత వస్తుందని వారు చెబుతున్నారు. కాగజ్‌నగర్‌ మండలంలోని కడంబా అటవీ ప్రాంతాన్ని 2014 సంవత్సరంలో ఫాల్గుణ పెద్దపులి ఆవాసంగా మార్చుకుంది. రెండు విడతల్లో ఫాల్గుణ ఎనిమిది పిల్లలకు జన్మనిచ్చింది. దీనికి పుట్టిన కే8 పెద్దపులి ఆరు నెలల వయస్సు నుంచి పెంచికల్‌పేట్‌ రేంజ్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంది. బెజ్జూర్‌ మండలంలోని మత్తడి, ఏటిగూడ, పాపన్‌పేట్‌, పెంచికల్‌పేట్‌ రేంజ్‌ పరిధిలోని లోడుపల్లి, ఎల్లూర్‌, మెరెగూడ, కమ్మర్‌గాం, దహెగాం మండలంలోని మొట్లగూడ, రాంపూర్‌, కుశ్నపల్లి రేంజ్‌ వరకు సంచరించింది. పెంచికల్‌పేట్‌ మండలం మురళీగూడ వద్ద ప్రాణహిత నది దాటి మహారాష్ట్రకు సైతం రాకపోకలు సాగించింది. కే8 పెద్దపులి 2021 సంవత్సరంలో పెంచికల్‌పేట్‌ అటవీ ప్రాంతంలో మూడు పిల్లలకు జన్మనిచ్చింది. గత మూడేళ్లుగా ఈ పెద్దపులికి సరైన ఆవాసం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. అప్పటి నుంచి ఒంటరిగానే తిరుగుతోంది. దాని సంచారాన్ని అటవీశాఖ సరిగ్గా అంచనా వేయకపోవడంతోనే వేటగాళ్ల విద్యుత్‌ తీగలకు బలై పోయిందనే ఆరోపణలు ఉన్నాయి.

తీరు మారేనా..

కవ్వాల్‌ అభయారణ్యానికి మహారాష్ట్రలోని తాడోబా పులుల అభయారణ్యానికి మధ్య కారిడార్‌గా ఉన్న కాగజ్‌నగర్‌ డివిజన్‌లో అటవీశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా పెద్దపులులతో పాటు పెద్దఎత్తున వన్యప్రాణుల వేట కొనసాగుతోంది. ఘటనలు జరిగినప్పుడు హ డావుడి చేసి కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఫలితంగా వన్యప్రాణుల సంచారం ఎక్కువగా కాగజ్‌నగర్‌ డివిజన్‌లో వేటగాళ్లు రెచ్చి పోతున్నారు. సిర్పూర్‌(టి), బెజ్జూర్‌, పెంచికల్‌పే ట్‌, కౌటాలా, ఖర్జెల్లి రేంజ్‌ల్లో కొంతమంది వేటను వృత్తిగా మార్చుకున్నారు. విద్యుత్‌ తీగలు, ఉచ్చులు, విష ప్రయోగం చేసి వేటాడుతున్నారు. జిల్లాలోని పలు అనుకూల ప్రాంతాలను వెతుక్కుంటూ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని తడోబా, తిప్పేశ్వర్‌, ఇంద్రావతి అభయారణ్యాల నుంచి పెద్దపులులు సంతానోత్పత్తికి కోసం తరలివస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం, గడ్డిమైదానాలు, నిరంతరం నీటి లభ్యతతో ఈ ప్రాంతాలను ఆవాసంగా మార్చుకున్నాయి. గడిచిన పదేళ్లలో వాటి సంఖ్య గణనీయం పెరిగింది. పులుల సంరక్షణకు నిధులు కేటాయిస్తున్నా అధికారులు వాటి ప్రాణాలు కాపాడలేకపోతున్నారు. కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని దరి గాం ప్రాంతంలో రెండు పెద్దపులులు, తాజాగా ఎ ల్లూర్‌ అటవీ ప్రాంతంలో మరో పులి వేటగాళ్ల వి ద్యుత్‌ తీగలకు బలికావడంతో ఆందోళన కలిగిస్తుంది. కే 8 పెద్దపులిని హతమార్చిన ఘటనలో అట వీశాఖ దూకుడుగా వ్యవహరిస్తోంది. గతంలో ఎ న్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వేటను వృత్తిగా మార్చుకున్న వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంతోపాటు అటవీప్రాంత సమీప ప్రాంతాల్లో వన్యప్రాణులతో ఘర్షణ వాతావరణం తగ్గించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement