
గుట్టలుగా డంప్!
● జిల్లాకు భారీగా నకిలీ విత్తనాలు సరఫరా ● పోలీసుల తనిఖీల్లో క్వింటాళ్ల కొద్దీ పట్టివేత
సమాచారం అందించాలి
గతేడాది రూ.30లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నాం. ఈ సంవత్సరం కూడా భారీగా విత్తనాలు స్వాధీనం చేసుకున్నాం. జిల్లా అధికారి ఆదేశానుసారం అప్రమత్తతతో ఉంటూ తనిఖీలు చేపడుతున్నాం. అమాయక రైతులను మోసం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదు. నకిలీ పత్తి విత్తనాల క్రయవిక్రయాలు జరిగితే పోలీసులకు సమాచారం అందించాలి.
– రాణా ప్రతాప్, టాస్క్ఫోర్స్ సీఐ
బెజ్జూర్(సిర్పూర్): ఈ ఏడాది సాగు పనులు ముందే మొదలయ్యాయి. జోరుగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు పత్తి విత్తనాలు విత్తేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇదే అదనుగా అక్రమార్కులు గుట్టలుగా నకిలీ విత్తనాలను జిల్లాకు తరలిస్తున్నారు. జిల్లాలో రోజురోజుకు నకిలీ విత్తనాలు పట్టుబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయ, పోలీస్ శాఖల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఈ దందా మాత్రం ఆగడం లేదు. రెండు నెలలో పోలీసుల తనిఖీల్లో సుమారు రూ.82 లక్షల విలువైన 27 క్వింటాళ్ల నిషేధిత పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. తాజాగా బెజ్జూర్ మండలం సుశ్మీర్ కృష్ణపల్లి గ్రామాల్లో రెండు క్వింటళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ ఆదివారం తెలిపారు. కుక్కుడ గ్రామానికి చెందిన ప్రశాంత్, అనిల్, సుశ్మీర్ గ్రామానికి చెందిన సురేశ్, సిర్పూర్(టి) మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన అశోక్పై కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు.
దళారులదే రాజ్యం..
రాష్ట్రంలోనే మారుమూల ప్రాంతమైన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కొంతమంది దళారులుగా ఏర్పడి అమాయక రైతులకు నకిలీ విత్తనాలు అంట గడుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో తయారైన ఈ వి త్తనాల విక్రయాల్లో అధికశాతం మంది ఆంధ్రప్రాంతానికి చెందిన వ్యక్తులే ఉంటున్నారు. గతంలో ఈ ప్రాంతంలో పర్యటించి పట్టు సాధించిన వారే కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ముఠాలు ఈ ప్రాంత రైతులతో సాన్నిహిత్యం పెంచుకుని న మ్మకాన్ని చూరగొంటున్నాయి. జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దుగా ఉండటంతో ప్రాణహిత నది పరీవా హక ప్రాంతాల వెంట అధికారులకు చిక్కకుండా న కిలీ విత్తనాలను తరలిస్తున్నారు. ఆయా మార్గాలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేసినా అడ్డుకట్ట పడటం లేదు. వర్షాకాలం సీజన్ ప్రారంభానికి ముందే జిల్లాలోకి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని పలు జిల్లాల నుంచి వివిధ మార్గాల ద్వారా డంప్ చేసి ఉంచుతున్నారు. అడ్రస్ లేని కంపెనీల్లో తయారైన విత్తన ప్యాకెట్లపై తయారీ తేదీ, వ్యాలిడిటీ, ఇతర వివరా లు ఉండటం లేదు. గోనె సంచుల్లో గ్రామాల్లోకి తరలిస్తున్నారు. కొందరు ఒరిజినల్ ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. లైసెన్స్ పొందిన కొందరు డీలర్ల అండదండలతోనే దళారులు నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల ఘటనలు
పోలీసుల అప్రమత్తత, టాస్క్ఫోర్స్ తనిఖీలతో ఇ టీవల రూ.లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడుతున్నాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్తోపాటు, మండల పోలీసు స్టేషన్లకు కూడా ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశారు.
● రెండు నెలల క్రితం చింతలమానెపల్లిలో రూ. 10.50 లక్షల విలువైన 3 క్వింటాళ్ల నకిలీ విత్తనా లను టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు.
● 15 రోజుల క్రితం రూ.12 లక్షల విలువైన నా లుగు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.
● తాజాగా శనివారం రూ.60 లక్షల విలువైన 20 క్వింటాళ్ల బీటీ– 3 నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా నుంచి కాగజ్నగర్కు 20 క్వింటాళ్ల విత్తనాలను తరలిస్తున్న ఐచర్ వాహనంలో తనిఖీ చేసి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.