
● గతేడాది క్వింటాల్ మిరప పంటకు రూ.18వేలు ● ఈ ఏడాది రైత
మిరప పంటతో రైతు
చింతలమానెపల్లి(సిర్పూర్): ఈ ఏడాది మిరప రైతులకు నష్టాలే మిగిలాయి. బహిరంగ మార్కెట్లలో ధర భారీగా రేట్లు పతనం కావడంతో నష్టపాలయ్యారు. అప్పులు తీర్చేమార్గం కనిపించడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. గతేడాది మిరప పంటకు క్వింటాలుకు రూ.20వేల ధర ఉండగా.. ఒక్కో రైతుకు నాణ్యమైన పంట క్వింటాలుకు రూ.15వేల నుంచి రూ.18వేల ధర లభించింది. కానీ ఈ ఏడాది ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలుకు గరిష్టంగా రూ.12వేలే పలుకుతోంది. జిల్లా రైతులకు నాగాపూర్, వరంగల్ మార్కెట్లలో రూ.8వేల నుంచి రూ.11వేల ధర వస్తోంది. మిరప పంట సాగుకు ఎకరాకు రూ.1.20 లక్షల వరకు ఖర్చవుతుండగా, ఎకరాకు కనిష్టంగా 9 క్వింటాళ్ల నుంచి గరిష్టంగా 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. ఈ లెక్కన రైతుకు పెట్టుబడి కూడా దక్కడం లేదు. రూ.లక్షల్లో నష్టం మిగులుతోంది.
మహారాష్ట్రకు తరలింపు..
జిల్లాలో ఏటా మిరప పంట రైతులు సాగు చేస్తున్న విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. రెండేళ్ల క్రితం కాగజ్నగర్ డివిజన్ పరిధిలో 2100 ఎకరాలు ఉండగా.. ఈ ఏడాది ఒక్క కౌటాల మండలంలోనే సుమారు రెండు వేల ఎకరాల్లో సాగు చేశారు. పత్తి, సోయా పంటలతో పోలిస్తే మిరపలో లాభాలు సా ధిస్తుండడంతో రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. చింతలమానెపల్లి మండలంలో సుమారుగా 800 ఎకరాలు, బెజ్జూర్ మండలంలో 400 ఎకరాలు, పెంచికల్పేట్ మండలంలో 600 ఎకరాలు, దహెగాం మండలంలో 800 ఎకరాలు, సిర్పూర్(టి) మండలంలో సుమారుగా 2వేల ఎకరాల్లో సాగు చేసినట్లుగా అంచనా. స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో జిల్లా రైతులు పంటను మహారాష్ట్రకు తరలిస్తున్నారు. స్థానికంగా పండించే పంట నాణ్యతతో ఉన్నా నాగ్పూర్, ఇంగన్గాట్ తదితర ప్రాంతాల్లో అమ్ముకోవాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో పంట కొనుగోలు చేస్తున్నా.. స్థాని కులు ఎక్కువగా మహారాష్ట్రకు వెళ్లేందుకే మొ గ్గు చూపుతున్నారు. అక్కడా దళారులు చెప్పిన ధరకే విక్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
అందని మద్దతు ధర..
మూడేళ్లుగా కౌటాల మండలం తాటిపల్లి రైతులు మిరప పంటను సాగు చేస్తూ లాభాలు గడించారు. వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించి గ్రామస్తులను ప్రోత్సహించారు. వీరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మిరప పంట కు వస్తున్న ఆదరణతో కౌటాలతోపాటు జిల్లావ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగింది. విస్తీర్ణం పెరిగినా రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం కొరవడింది. మద్దతు ధర కూడా లభించడం లేదు. వరంగల్, కరీంనగర్, మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతాల్లో రైతులకు రూ.12,500 నుంచి రూ.14వేల వరకు ధర వచ్చింది. కానీ మన జిల్లా రైతులకు ఆరంభంలో రూ.12వేల ధర పలికినా వెంటనే ధర తగ్గించారు. ప్రస్తుతం క్వింటాల్కు రూ.9వేల నుంచి రూ.7వేలకు పడిపోయింది. ధర తగ్గుతూనే ఉండడం ఆందోళనకరంగా మారింది. డిసెంబర్ చివరివారం నుంచి ఏప్రిల్ వరకు విక్రయించారు. డిసెంబర్లో క్వింటాల్కు రూ.12,500 లభించగా ఏప్రిల్లో రూ.7,500కు ధర మాత్రమే దక్కింది.
కారణాలు అనేకం..
జిల్లా రైతులు పండించిన మిరప పంటకు ధర దక్కకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నా యి. గతేడాది దిగుబడి గణనీయంగా వచ్చింది. కానీ ఈ ఏడాది సీజన్ ఆరంభం నుంచే చీడపీడలు ఆశించడంతో రసాయనిక మందుల వినియో గం పెరిగింది. వాతావరణం కూడా ఈ ఏడాది మారిపోయింది. పురుగుమందులు, రసాయనిక ఎరువుల వినియోగం రెట్టింపయింది. పండిన పంట నాణ్యత కోల్పోయింది. మిరప కాయ సైజు, రంగు, మెరుపు లేకపోవడంతో మార్కెట్లో ధర తగ్గింది. రంగు తగ్గిన కాయలు పెరిగి ధర దక్కలేదని అక్కడి హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. మిరప పంట ఇతర ప్రాంతాల రైతుల సాగు పద్ధతులకు, మన జిల్లా రైతుల సాగు పద్ధతులకు తేడా కనిపించింది. స్థానికంగా రైతులకు పంటల సాగులో తగిన సలహాలు, సూచనలు అందించడంలో వ్యవసాయ శాఖ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. కాయ నాణ్యత లేకపోవడంతో కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేయడానికి కూడా అనుకూలంగా లేదు. తేమ ఎక్కువగా ఉండడం కూడా ధర తగ్గడానికి కారణమైంది. మెలకువలు అందించడంలో అధికారుల ప్రోత్సాహం కరువైందని ఆరోపిస్తున్నారు.