సూపర్‌ బజార్‌ బంద్‌! | - | Sakshi
Sakshi News home page

సూపర్‌ బజార్‌ బంద్‌!

May 3 2025 11:23 AM | Updated on May 3 2025 11:23 AM

సూపర్‌ బజార్‌ బంద్‌!

సూపర్‌ బజార్‌ బంద్‌!

● గోలేటిటౌన్‌షిప్‌లో తెరుచుకోని సింగరేణి సూపర్‌బజార్‌ ● నిత్యావసర సరుకులకు కిరాణ దుకాణాలే ఆధారం ● ఇబ్బందులు పడుతున్న కార్మిక కుటుంబాలు

రెబ్బెన(ఆసిఫాబాద్‌): సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులకు నాణ్యమైన సరుకులు బయటి మార్కె ట్‌ కంటే తక్కువ ధరకే అందించేందుకు సూపర్‌బ జార్లను ఏర్పాటు చేసింది. కార్మిక కుటుంబాల అవసరాలకు అనుగుణంగా సరుకులు అందించడంతో ప్రారంభంలో సూపర్‌బజార్లు విజయవంతంగా నడిచాయి. కాలక్రమంలో ఆసక్తి సన్నగిల్లడం, అవసరాలకు తగినట్లు సరుకులు అందుబాటులో లేకపోవడంతో అవి లక్ష్యానికి దూరమయ్యాయి. ఇందులో భాగంగా బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి టౌన్‌షిప్‌లో ఉన్న సూపర్‌బజార్‌ సైతం మూతబడింది. కార్మిక కుటుంబాలు బయట మార్కెట్‌లో అధిక ధరలకు సరుకులు కొనుగోలు చేయాల్సి వస్తోంది.

పరిస్థితులు మారినా..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ యుగం నడుస్తోంది. మారుమూల ప్రాంతాలకు సైతం ఈ– కామర్స్‌ సంస్థలు సేవలు విస్తరించడంతో ఇంట్లో ఉండి కావాల్సిన వస్తువులు ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సింగరేణి సంస్థ సూపర్‌బజార్లను పరిస్థితులకు అనుగుణంగా అప్‌డేట్‌ చేయలేకపోయింది. ఫలితంగా సూపర్‌బజార్లకు వచ్చే కార్మిక కుటుంబాల సంఖ్య తగ్గి ఆదరణ తగ్గిపోయింది. అవసరమైన వస్తువులు అందుబాటులో ఉంచకపోవడం, సకాలంలో సరుకులు తెప్పించకపోవడంతో బయటి మార్కెట్‌కు వెళ్లేందుకు మొగ్గు చూపారు. కార్మిక కుటుంబాలకు అవసరమైన అన్నిరకాల వస్తువులను అందుబాటులో ఉంచి తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు అందించేలా ఏర్పాట్లు చేస్తే తిరిగి పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంది.

క్రెడిట్‌పై సరుకులు

సింగరేణి సూపర్‌బజార్లలో కార్మికులు క్రెడిట్‌పై నిత్యావసరులు తీసుకువెళ్లే అవకాశాన్ని యాజమాన్యం కల్పించింది. నెలాఖరు సమయంలో కుటుంబాలు నిత్యావసరాలు తెచ్చుకునే వెసులుబాటుతో కొంతమేర ఇబ్బందులు తగ్గేవి. క్రెడిట్‌పై తీసుకున్న సరుకులకు సంబంధించిన నగదును కార్మికుడి వేతనం నుంచి కట్‌ చేసేవారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా కుటుంబానికి సరుకులు లభిస్తాయనే ధీమా ఉండేది. కానీ సూపర్‌బజార్లు మూతపడటంతో నెలాఖరు సమయంలో కార్మిక కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. నిత్యావసరాలతోపాటు ఎలక్ట్రికల్‌ వస్తువులను సైతం సూపర్‌బజార్ల ద్వారా అందించేవారు. కాలక్రమేణా యాజమాన్యం సూపర్‌బజార్ల నిర్వహణను గాలికొదిలేయడం, అందుబాటులో సరుకులు ఉంచకపోవడం, సిబ్బంది అవినీతికి పాల్పడటం వంటి కారణాలు సూపర్‌బజార్లను మూసివేసే పరిస్థితులు ఏర్పడ్డాయి.

మారుమూల ప్రాంతాల్లో అవసరం

గోలేటిటౌన్‌షిప్‌ వంటి మారుమూల ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు సింగరేణి సూపర్‌బజార్లు ఎంతో అవసరం. గోలేటి నుంచి బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌, మంచిర్యాల వంటి పట్టణ ప్రాంతాలకు వెళ్లాలంటే కనీసం 20 నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణించాలి. పట్టణ ప్రాంతాల్లో డీమార్ట్‌, మోర్‌ మార్కెట్‌, రిలయన్స్‌ ఫ్రెష్‌ వంటి సూపర్‌ మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి. మారుమూల ప్రాంతమైన గోలేటిలో అలాంటి మార్కెట్‌లు లేవు. కార్మిక కుటుంబాలు, పరిసర ప్రాంతాల ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో నిత్యావసర సరుకుల కోసం కిరాణషాపులపైనే ఆధారపడాల్సి వస్తోంది. స్థానికంగా సూపర్‌బజార్‌ ఉన్నప్పటికీ కొంతకాలంగా దానిని మూసివేసి ఉంచడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అన్నిరకాల వస్తువులను అందుబాటులో ఉంచి తిరిగి సూపర్‌బజార్‌ను ప్రారంభించాలని కార్మిక కుటుంబాలు కోరుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement