
రయ్.. రయ్..!
● పగలు రోడ్లు.. రాత్రిళ్లు రేస్ ట్రాక్లు ● రేసింగ్, మందుబాబుల డేంజర్ డ్రైవింగ్తో ప్రమాదాలు ● జిల్లా కేంద్రంలో దడ పుట్టిస్తున్న బైకర్లు
సాక్షి, ఆసిఫాబాద్: పగలు.. రాత్రి తేడా లేదు. ఖరీదైన బైకులు జిల్లా కేంద్రంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. సాయంత్రం దాటితే చాలు ప్రధాన రహదారులు రేసు ట్రాకుల్లా మారుతున్నాయి. మంచిర్యాల– నాగ్పూర్ జాతీయ, పట్టణ రహదారులపై ప్రయాణం అంటేనే పట్టణ ప్రజలకు వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఖరీదైన కార్లు, బైకులతో దూసుకెళ్లడం.. ఒళ్లు తెలియనంతలా తప్పతాగి బండి నడపడం.. వెరసి ఎప్పుడు ఏవైపు నుంచి ఏ వాహనం ఢీకొడుతుందో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా మందుబాబుల డ్రైవింగ్ పాదాచారుల ప్రాణాల మీదకొస్తోంది. పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలతో కొంత నిలువరిస్తున్నా కొందరు మాత్రం అడ్డదారుల్లో రహదారుల మీదకు దూసుకొస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 298 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం గమనార్హం. ఈ ఏడాది జనవరి నెలలో ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన ఓ యువకుడు వాంకిడి నుంచి ద్విచక్రవాహనంపై తప్పతాగి వేగంగా ఆసిఫాబాద్కు వస్తూ టోల్గేట్ సమీపంలో గొర్రెల మందను ఢీకొట్టగా ఎనిమిది గొర్రెలు చనిపోగా.. తీవ్రంగా గాయపడిన యువకుడిని హైదరాబాద్కు తరలించారు. చికిత్స అనంతరం అతడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. గత నెలలో బూర్గుడ జిన్నింగ్ మిల్లు వద్ద రాంగ్రూట్ వస్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీకొనగా ఒకరికి గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నా నియంత్రించడం సాధ్యపడడం లేదు.
రాంగ్రూట్.. డేంజర్ డ్రైవింగ్..
కేస్లాపూర్ పెద్దవాగు బ్రిడ్జిపై రాంగ్రూట్లో ప్రయాణిస్తున్న వాహనదారుల తీరుతోనూ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నియంత్రించడం పోలీసులకు సాధ్యపడటం లేదు. ఆ వంతెనపై పోలీసులు ఎవరైనా విధుల్లో ఉన్నా వారి కళ్లుగప్పి వాహనదారులు రాంగ్రూట్లో వెళ్లడం పరిపాటిగా మారింది. ద్విచక్ర వాహనాలకు తోడు ఆటోలు సైతం పదుల సంఖ్యలో నిత్యం ప్రయాణికులతో నిబంధనలకు విరుద్ధంగా రాంగ్రూట్లో బ్రిడ్జి దాటుతున్నాయి. ఇప్పటికై నా పోలీసులు స్పందించి చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
దడ పుట్టిస్తూ..
జాతీయ రహదారిపై ఆకతాయిలు, పోకిరీలు స్టంట్లు వేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నా రు. ముఖ్యంగా రాత్రిపూట మరింత దారుణ పరి స్థితులు నెలకొంటున్నాయి. వారాంతాల్లో యువకులు బైక్ రేసింగ్లు నిర్వహిస్తూ.. వేగంగా దూ సుకెళ్తూ అవతలి వ్యక్తుల్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. నిందితుల్ని పట్టుకున్నా నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద కేసు నమోదుకే పోలీసులు పరిమితమవుతున్నారు. పోలీసులు వారాంతాల్లో తప్పనిసరిగా, మిగిలిన రోజుల్లో ఆకస్మికంగా డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. ఇవీ నిర్ణీత సమయం వరకే ఉండటంతో ఆ తర్వాత మందుబాబులు చెలరేగిపోతున్నారు. అర్ధరాత్రి తర్వాత రోడ్డు ప్రమాదాలకు ఇదీ ఓ కారణంగా నిలుస్తోంది.