నేలకొండపల్లి: ఆన్లైన్ గేమ్ ఆడితే అత్యధిక లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.42 వేలకు పైగా స్వాహా చేశారు. మండలంలోని గువ్వలగూడెంనకు చెందిన ఓ వ్యక్తికి గతనెల 23న ఇన్స్ట్రాగామ్లో గుర్తు తెలియని వ్యక్తులు పరిచయమయ్యారు. ఆన్లైన్ గేమ్లతో ఎక్కువగా డబ్బు వస్తుందని చెప్పడమే కాక, ఆట రాకున్నా తామే ఆడి డబ్బులు వచ్చేలా చూస్తామని నమ్మబలికారు. దీంతో గువ్వలగూడెం వాసి 12 పర్యాయాల్లో వారు చెప్పిన ఖాతాలకు రూ.42,048 నగదు పంపించాడు. ఆ తర్వాత లాభాల మాటేమో కానీ అసలు కూడా రాకపోవడంతో నిలదీయగా ముఖం చాటేశారు. దీంతో మోసపోయాయని గ్రహించిన వ్యక్తి సైబర్ క్రైమ్ నంబర్ 1930కు సమాచారం ఇవ్వడమే కాక బుధవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలుశిక్ష
ఖమ్మంలీగల్: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగికి ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయాధికారి కాకుమాని జ్యోతిర్మయి బుధవారం తీర్పు చెప్పారు. ఖమ్మం రాపర్తినగర్కు చెందిన పున్నా వెంకటేశ్వర్లు వద్ద పుట్టబంతి సత్యవతి 2018 సెప్టెంబర్లో రూ.6 లక్షల అప్పు తీసుకుంది. ఆ తర్వాత 2021 ఏప్రిల్లో రూ.ఆరు లక్షలకు చెక్కు ఇచ్చినా ఆమె ఖాతాలో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో వెంకటేశ్వర్లు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. ఈ మేరకు విచారణ అనంతరం సత్యవతికి ఏడాది జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.7 లక్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు.


