ఖమ్మంక్రైం: రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసినా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్దత్ ఆదేశించారు. వర్షాకాలం సన్నద్ధత, నకిలీ విత్తనాల కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఖమ్మం నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని వర్షపు నీరు భారీగా చేరే చెరువులు, కుంటలే కాక దెబ్బతిన్న వంతెనలు, చప్టాలను గుర్తించాలన్నారు. తద్వారా వరద ఉధృతి వస్తే ముందస్తు చర్యలు చేపట్టే అవకాశముంటుందని తెలిపారు. అలాగే, వర్షం వచ్చినప్పుడే రహదారులపై నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ కాకుండా మున్సిపల్, ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. కాగా, వ్యవసాయ సీజన్లో రైతులు నకిలీ విత్తనాలతో మోసపోకుండా విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. తక్కువ ధరకు విత్తనాలు ఇస్తామని గ్రామాలకు వచ్చే ముఠాలపై నిఘా పెట్టాలని సీపీ తెలిపారు.
20న జాతీయ లోక్అదాలత్
ఈ నెల 20వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీపీ సునీల్దత్ ఓ ప్రకటనలో కోరారు. ఆర్థిక భారం తగ్గించుకోవడమేకాక సమయం వృథా కాకుండా కేసులను ఇరువర్గాల రాజీతో పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్లో సివిల్ తగాదాలు, ఆస్తి విభజన కేసులు, వైవాహిక జీవితం, కుటుంబ సమస్యలకు సంబంఽధించిన కేసులు, డ్రంకెన్ డ్రైవ్, మోటారు వాహనాల చట్టం ఉల్లంఘన, చెక్ బౌన్స్, బ్యాంక్ రికవరీ, విద్యుత్ చౌర్యం కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
అధికారుల సమీక్షలో సీపీ సునీల్దత్


