అదనపు కలెక్టర్ శ్రీజ
ఖమ్మంరూరల్: అన్ని కార్యాలయాలు ఒకేచోట కొలువుదీరేలా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ భవన సముదాయం పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి తరుణీహాట్లో రూ.22 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల నిర్మాణాన్ని మంగళవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. నాణ్యతలో రాజీ పడకుండా పర్యవేక్షిస్తూనే వేగంగా పనులు జరిగేలా చూడాలని తెలిపారు. ఈ సముదాయం పూర్తయితే 17 విభాగాల కార్యాలయాలు ఒకేచోట ఉంటాయని, పెద్దసంఖ్యలో ప్రజలు రానున్నందున తాగునీటి సౌకర్యం కల్పించడమే కాక వెయిటింగ్ హాళ్లు కూడా నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ వినయేందర్రెడ్డి, ఎంఈఓ మూడ్ శ్రీనివాస్, ఆర్అండ్బీ డీఈ భగవాన్ పాల్గొన్నారు.


