అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు హోటళ్లు, డాబాల్లో గురువారం జిల్లా ఫుడ్ సేప్టీ అధికారి శరత్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్థానిక ఓ హాటల్లో కొద్ది రోజుల క్రితం కొనుగోలు చేసిన ఆహారంలో కోడి ఈక రాగా, దీనిపై బాధిత వినియోగదారుడు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఫుడ్ సేప్టీ అధికారి పలు హోటళ్లు, డాబాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హోటళ్లు, డాబాలలో పరిశుభ్రత ప్రమాణాలు, ఆహార పదార్థాల నిల్వ విధానం, వంట గదులు, ఫుడ్ సేప్టీ లైసెన్సులను ఆయన పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006 ప్రకారం 5 నమూనాలు, 12 సర్వేలైన్స్ నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపారు. అలాగే నిబంధనలు పాటించని నిర్వాహకులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేశారు. ఫుడ్ సేప్టీ లైసెన్సులు లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి ఒక వారం రోజుల గడువు ఇచ్చి లైసెన్సులు పొందాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో డిజిగ్నేటెడ్ ఆఫీసర్ దినేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


