
పిల్లల భవిష్యత్ మార్చేది ఉపాధ్యాయులే..
● సెప్టెంబర్ నుంచి ఎస్సెస్సీ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ● ఎఫ్ఆర్ఎస్ ద్వారా ఉపాధ్యాయుల హాజరు నమోదు ● విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా
ఖమ్మం సహకారనగర్: పిల్లల భవిష్యత్ను ఉజ్వలంగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించి తరగతి గదిలో విద్యార్థులతో మమేకమవుతూ పాఠాలు బోధించాలని సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో గురువారం ఆమె విద్యాశాఖ సంచాలకులు డాక్టర్ ఈ.నవీన్ నికోలస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజలతో కలిసి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా యోగితారాణా మాట్లాడుతూ రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలలను తనిఖీ చేశామని తెలిపారు. సింగరేణి మండలం కారేపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ చొరవతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని నమ్మకం కలిగిందన్నారు. అలాగే, ఖమ్మం ఎన్నెస్పీ క్యాంప్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఏడాది 140 మంది విద్యార్థులు కొత్తగా చేరడం ఆనందంగా ఉందని తెలిపారు. పాఠశాలలకు వచ్చే పిల్లలకు నేర్పించేదే వారి జీవితంలో కీలకంగా మారుతుందని చెప్పారు. ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేస్తూ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాలని సూచించారు. డీఈఓలు, ఎంఈఓలు తరచూ పాఠశాలలను తనిఖీ చేస్తూ ఉపాధ్యాయులకు సూచనలు చేయాలని, ఐఏ ల్యాబ్ల నిర్వహణపై దృష్టి సారించాలని తెలిపారు. ఇదే సమయాన పాఠశాలల్లో ఉపాధ్యాయులు సకాలంలో హాజరయ్యేలా పర్యవేక్షిస్తూ వారి హాజరును ఫేస్ రికగ్నేషన్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్) ద్వారా నమోదు చేయాలని సూచించారు. అలాగే, జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలల సమీపాన అంగన్వాడీ కేంద్రాల నుంచి పిల్లలను చేర్పించాలని సూచించిన ఆమె... పదో తరగతిలో మెరుగైన ఫలితాల సాధనకు సెప్టెంబర్ నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించి స్నాక్స్ సమకూర్చాలని తెలిపారు. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేకంగా ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేసి విద్యార్థులందరికీ కార్డులు జారీ చేయించాలని సూచించారు. అనంతరం విద్యా శాఖ సంచాలకులు డాక్టర్ ఈ.నవీన్ నికోలస్, జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడగా ఎస్సెస్సీలో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన, మూతబడిన స్కూళ్లు తెరిపించిన, అత్యధికంగా విద్యార్థులను చేర్పించిన మండలాల ఎంఈఓలను సన్మానించారు. ఈ సమీక్షలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రెయినీ కలెక్టర్ సౌరభశర్మ, విద్యాశాఖ రాష్ట్రస్థాయి అధికారులు రమణకుమార్, రాజీవ్, సత్యనారాయణరెడ్డి, మదన్మోహన్, వెంకటనర్సమ్మ, డాక్టర్ హెచ్.హరీష్, మంజరి, డీఈఓ సత్యనారాయణ, నాలుగు జిల్లాల విద్యాశాఖ అధికారులతో పాటు జి.సురేష్, ప్రాంజలి పాఠక్, తదితరులు పాల్గొన్నారు.