
మిర్చి సాగు తగ్గుతుందా?!
మధిర: గత ఏడాది వాతావరణ పరిస్థితులు, తెగుళ్ల కారణంగా మిర్చి దిగుబడి గణనీయంగా పడిపోయింది. వచ్చిన మిర్చికి కూడా సరైన ధర పలకలేదు. అన్ సీజన్లోనైనా ధర పెరుగుతుందని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేస్తే ఇప్పుడు కూడా మిర్చిలో ప్రధాన రకమైన తేజాకు క్వింటా ధర రూ.13 వేలు దాటడం లేదు. దీంతో ఈ సీజన్లో రైతులు మిర్చి సాగుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానంలో పత్తి, ఇతర పంటల సాగుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జిల్లాలోని పలు నర్సరీల్లో ఇప్పటివరకు నారు పెంపకం ఊపందుకోకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
గత ఏడాది 288 నర్సరీల్లో...
జిల్లాలో ఉద్యానశాఖ నుంచి అనుమతి తీసుకుని 288 నర్సరీల్లో మిరప నారు పెంపకం చేపట్టారు. అయితే, ఈ ఏడాది అదనంగా ఒక్క నర్సరీ ఏర్పాటుకు కూడా దరఖాస్తు అందకపోగా, పాత వారే రెన్యువల్ చేయించుకున్నారు. అయితే, ఆయా నర్సరీల్లోనూ నారు పెంపకం ఇప్పటివరకు ఊపందుకోకపోవడం గమనార్హం. గత ఏడాది 288 నర్సరీల్లో 67కోట్ల మొక్కలకు సరిపడా నారు పెంచినట్లు అంచనా. ఈ మేరకు జిల్లాలో 60,401 ఎకరాల్లో మిరప పైరు సాగు చేయగా, ఈసారి 50 వేల ఎకరాలు దాటకపోవచ్చని భావిస్తున్నారు.
ఆర్డర్లు కరువు
సాధారణంగా మిరప నాటే సమయానికి 70 శాతం మంది రైతులు నారు కోసం నర్సరీల్లో ఆర్డర్ చేసి అడ్వాన్స్గా నగదు చెల్లిస్తారు. ఇందులో కొందరు తమకు కావాల్సిన రకం విత్తనాలను సొంతంగా తీసుకొస్తే మరికొందరు నర్సరీల యజమానులకే ఫలానా రకం కావాలని సూచిస్తారు. అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకు ఐదు శాతం బుకింగ్ కూడా కాలేదని నర్సరీల యజమానులు చెబుతున్నారు. ఫలితంగా జూలై నెల సమీపిస్తున్నా మొక్కల పెంపకం పనులు చాలా నర్సరీల్లో మొదలేకాలేదు. ఇంకొందరు మాత్రం ఆర్డర్లు వస్తాయనే నమ్మకంతో అరకొరగా నారు పెంచుతున్నారు.
గత ఏడాది దిగుబడితో పాటు
తగ్గిన ధర
ఫలితంగా పత్తి, ఇతర పంటల వైపు రైతుల మొగ్గు
జిల్లాలోని నర్సరీల్లో ఊపందుకోని నారు పెంపకం
ఈయన పేరు
వడ్లమూడి శ్రీనివాసరావు. మధిర మండలం మాటూరు క్రాస్ సమీపాన పదిహేనేళ్లుగా భూమి కౌలుకు తీసుకొని మిరప నర్సరీ నిర్వహిస్తున్నాడు. పది ఎకరాల విస్తీర్ణంలో ఏటా 2కోట్ల మేర మిరప మొక్కలు పెంచి అమ్ముతుంటాడు. సీజన్కు ముందుగానే 1.20 కోట్ల మిరప మొక్కలకు సంబంధించి బుకింగ్ ఉంటుంది. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు 5లక్షల బుకింగ్ మాత్రమే నమోదు కావడం గమనార్హం. దీంతో ఏటా పదుల సంఖ్యలో కూలీలకు ఉపాధి కల్పించే శ్రీనివాసరావు ఇప్పుడు కూలీలను నియమించుకోవాలా, వద్దా అన్న సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతున్నాడు. రైతులు మిర్చి సాగుపై ఆసక్తి చూపడం లేదని భావించి మొక్కల పెంపకం తగ్గించినట్లు చెబుతున్నాడు.

మిర్చి సాగు తగ్గుతుందా?!

మిర్చి సాగు తగ్గుతుందా?!