
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక
● తహసీల్లో రూ.200 చెల్లిస్తే ట్రాక్టర్ లోడ్ ● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
ఖమ్మంగాంధీచౌక్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరగకుండా అవసరమైన ఇసుక సరఫరాపై అధికారులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన వివిధ శాఖల అధికారులతో ఇసుక రీచ్ల నిర్వహణ, కూపన్ల జారీపై సమీక్షించారు. లబ్ధిదారులకు ఎన్ని ట్రాక్టర్ల ఇసుక అవసరమో హౌజింగ్ శాఖ ఏఈ గుర్తించి ఇచ్చే లేఖ ఆధారంగా తహసీల్దార్ కూపన్ జారీ చేయాలని తెలిపారు. ఈ కూపన్ ఆధారంగా మూడు రోజుల్లోగా మండలానికి కేటాయించిన రీచ్ నుంచి ఇసుక తరలించుకోవాలని చెప్పారు. రీచ్ల నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించగా లబ్ధిదారులు ప్రతీ ట్రాక్టర్ లోడ్ ఇసుకకు రూ.200 తహసీల్లో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇందులో రూ.100 మహిళా సంఘాలకు, గ్రామపంచాయతీ, గ్రామీణ అభివృద్ధి శాఖకు రూ.50 చొప్పున అందుతాయని చెప్పారు. కాగా, ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే రీచ్ల నుండి ఇసుక తరలింపునకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
విపత్తుల నిర్వహణ బృందాలకు సామగ్రి
వరద ముప్పు ఎదురైతే సహాయక చర్యల్లో పాల్గొనే బృందాలకు అవసరమైన పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. టార్చ్ లైట్లు, లైఫ్ జాకెట్లు, మైక్ సెట్లు, బోట్లు తదితర సామగ్రి ఏ మేరకు అవసరమో గుర్తించాలని సూచించారు. ప్రతీ 15రోజులకోసారి మండల స్థాయిలో విపత్తు నిర్వహణ కమిటీ సమావేశాలు నిర్వహించి ఆపద మిత్రలు, గజ ఈతగాళ్లతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేయాలని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ సన్యాసయ్య, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, జిల్లా మైనింగ్ అధికారి సాయినాథ్, ఆర్డీవోలు నర్సింహారావు, ఎల్.రాజేందర్, డీఎల్పీఎఓ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.