
‘బడిబాట’తో పెరిగిన ప్రవేశాలు
ఖమ్మం సహకారనగర్/ఏన్కూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా నిర్వహించిన బడిబాట కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలను ఇచ్చిందని విద్యాశాఖ వరంగల్ ఆర్జేడీ కె.సత్యనారాయణరెడ్డి తెలిపారు. కలెక్టరేట్లోని డీఈఓ కార్యాలయాన్ని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన బడిబాట, ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై సమీక్షించారు. గత ఏడాదితో పోలిస్తే ఒకటో తరగతిలో విద్యార్థుల ప్రవేశాలు 33 శాతం పెరిగాయని సీఎంఓ రాజశేఖర్ వివరించారు. కలెక్టర్, డీఈఓ సత్యనారాయణ సూచనలతో విద్యార్థులు లేక మూతపడిన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించామని, తద్వారా 14 స్కూళ్లను పునఃప్రారంభించగా కొత్తగా ఒక పాఠశాల ఏర్పాటుచేశామన్నారు. అనంతరం ఆర్జేడీ మాట్లాడుతూ ప్రవేశాలు తగ్గిన హెచ్ఎంలతో సమావేశాలు నిర్వహించి కొత్త విద్యార్థుల నమోదుపై దృష్టి సారించాలన్నారు. కాగా, భవిత కేంద్రాల్లో దివ్యాంగులకు పరికరాలు అందించడంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ పాపారావు, ఉపాధ్యాయుడు పెసర ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. ఆతర్వాత ఏన్కూరులోని కస్తూర్బాగాంఽధీ బాలికల విద్యాలయాన్ని ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులు, పరిసరాలు, వంటగదిని పరిశీలించిన ఆయన పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. స్పెషల్ ఆఫీసర్ లావణ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి