‘జల వనరులు’ ఖాళీ ! | - | Sakshi
Sakshi News home page

‘జల వనరులు’ ఖాళీ !

Jun 28 2025 5:57 AM | Updated on Jun 28 2025 7:29 AM

‘జల వనరులు’ ఖాళీ !

‘జల వనరులు’ ఖాళీ !

● ప్రధాన పోస్టులు భర్తీకి నోచుకోక ఇన్‌చార్జ్‌లతో పాలన ● ఫలితంగా ఆయకట్టుకు నీటి సరఫరాపై ప్రభావం ● అభివృద్ధి పనుల పర్యవేక్షణపైనా నీలినీడలు

ఖమ్మంఅర్బన్‌: జిల్లా రైతుల్లో అత్యధికంగా సాగునీటి ప్రాజెక్టుల ఆధారంగా సాగు చేస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్టుల ద్వారా నీటి పంపిణీలో కీలకంగా వ్యవహరించే జలవనరుల శాఖలో పోస్టులు నెలల తరబడి భర్తీ జరగడం లేదు. కీలక అధికారుల పోస్టులు ఖాళీగా ఉండటం, కొన్నింటిని ఇన్‌చార్జ్‌లతో నెట్టుకొస్తుండడంతో ప్రాజెక్టుల నిర్వహణ, అభివృద్ధి పనుల పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో సుమారు 2.54 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగర్‌ కాల్వల ద్వారా నీరు అందుతుండగా.. చెరువులు, చెక్‌డ్యాములు, వాగులు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాల ఆధారంగా మరో 3లక్షల ఎకరాలకు పైచిలుకు భూమి సాగవుతోంది.

చాలాచోట్ల ఖాళీ కుర్చీలే

ప్రస్తుతం జిల్లాలోని అనేక డివిజన్లలో ఈఈ, డీఈ స్థాయి పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్న వారిపై భారం పడుతుండగా పనులు ఆనుకున్న స్థాయిలో వేగంగా జరగడంలేదు. కల్లూరు డివిజన్‌ ఈఈ పోస్టులో కొనసాగిన అధికారి మార్చి 31న ఉద్యోగ విరమణ చేయగా అప్పటి నుంచి ఖాళీగానే ఉంది. ఈ స్థానంలో కనీసం ఇన్‌చార్జ్‌ను కూడా నియమించకపోవడం గమనార్హం. అలాగే ఖమ్మం రూరల్‌ డివిజన్‌ డీఈ పోస్టు నాలుగేళ్ల నుంచి ఖాళీగానే ఉండడంతో ప్రస్తుతం నేలకొండపల్లి డీఈకి అదనపు బాధ్యతలు అప్పగించారు. అంతేకాక జలవనరుల శాఖ సర్కిల్‌ కార్యాలయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఖమ్మం సీఈ గత డిసెంబర్‌లో రిటైర్‌ కాగా, నల్లగొండ సీఈ రమేష్‌బాబుకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. అంతేకాక అక్టోబర్‌లో ఖమ్మం ఎస్‌ఈ రిటైర్‌ అయినా ఇప్పటికీ కొత్త అధికారిని నియమించకుండా పాలేరు ఈఈకి ఆ బాధ్యతలు కట్టబెట్టారు. ఇక మార్చిలో రిటైర్‌ అయిన డిప్యూటీ సీఈ స్థానంలోనూ ఎవరినీ నియమించకుండా కల్లూరు అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

పర్యవేక్షణ ఎలా?

ఇప్పుడిప్పుడే పంటల సాగు ఊపందుకుంటుండగా సాగునీటి సీజన్‌ మొదలవుతుంది. ఆయకట్టు ప్రాంతాల్లో నెల రోజుల్లోగా వరి నాట్లు వేయడం ప్రారంభిస్తారు. ఈ తరుణాన పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతులపై పర్యవేక్షణ కరువవుతోంది. అంతేకాక పనుల పరిశీలన, కోర్టు కేసులకు హాజరుకావడం కూడా కష్టమవుతోందని సంబంధిత శాఖ అధికారులే చెబుతున్నారు. జిల్లాల సీతారామ ప్రాజెక్టు, మున్నేరు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులే కాక గత ఏడాది వరదలతో దెబ్బతిన్న కాల్వల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. అయితే, పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో ఇన్‌చార్జ్‌లు రెండు చోట్ల పనులను పర్యవేక్షించే పరిస్థితి లేక వేగంగా జరగడం లేదు. ఇకనైనా అధికారుల నియామకంపై ప్రభుత్వం స్పందించకపోతే రానున్న వ్యవసాయ సీజన్‌లో మరిన్ని ఇక్కట్లు ఎదురయ్యే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement