
అమెరికాది యుద్ధోన్మాదం..
వైరా: సామ్రాజ్యవాద ఆధి పత్యం కోసమే కాక యుద్ధోన్మాదంతో ఇరాన్పై అమెరికా దాడులకు పాల్ప డిందని.. ఈ దాడులు అంతర్జాతీయ ఉద్రిక్తతలను పెంచుతుండగా, భారతీయులు సైతం నష్టపోయే ప్రమాదం ఉందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. వైరా పట్టణ, కొణిజర్ల మండల పార్టీ సభ్యుల రాజకీయ శిక్షణా తరగతులను సోమవారం ఆయన వైరాలో ప్రారంభించి ప్రసంగించారు. ఇరాన్ ఆణ్వాయుధాలు తయారు చేస్తున్నట్లు అధారాలు లేవని అమెరికన్ ఇంటిలిజెన్స్ సంస్థలు, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకటించినా ట్రంప్ ఇజ్రాయిల్కు మద్దతుగా ట్రంప్ ఇరాన్పై దాడులు చేయించాడని ఆరోపించారు. ఇరాన్ను ధ్వంసం చేసి పశ్చిమాసియాను ఆక్రమించుకోవడం ద్వారా అంతర్జాతీయ చమురు వనరులను దోచుకుని ప్రపంచంపై పెత్తనం చెలాయించాలనేది అమెరికా లక్ష్యంగా తెలుస్తోందన్నారు. అయితే, ఈ దాడులను పలు దేశాలు ఖండించినా భారత ప్రధాని మోదీ స్పందించకపోవడం బీజేపీ ధ్వంద్వ నీతికి అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేయడంతో భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి నిత్యావసర వస్తువులపై ప్రభావం పడుతుందని వీరభద్రం పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, నాయకులు తాళ్లపల్లి కృష్ణ, మాచర్ల భారతి, బండి రమేష్, చింతనిప్పు చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.
కార్మికవర్గాన్ని విస్మరిస్తే పతనం తధ్యం
సత్తుపల్లిరూరల్: కార్మిక వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రభుత్వ పతనం తప్పదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి చలమాల విఠల్రావు పేర్కొన్నారు. వచ్చేనెల 9న జరనున్న సార్వత్రిక సమ్మె విజయవంతానికి సత్తుపల్లి లో సోమవారం నిర్వహించి న సమావేశంలోసాయన మాట్లాడారు. కార్మిక, కర్షక, విద్యార్థి, నిరుద్యోగులతో పాటు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈమేరకు ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈసమావేశంలో నాయకులు కొలికపోగు సర్వేశ్వరరావు, మోరంపూడి పాండురంగారావు, మట్టపర్తి సత్యనారాయణ, ఎలగం కృష్ణ, శ్రీనివాసరావు, సైదా, యాకోబు, మస్తాన్, రవి, రాము, సత్యనారాయణ, భాస్కర్, రమేష్, సురేష్ పాల్గొన్నారు.
కోల్డ్ స్టోరేజ్ల్లోనే మిర్చి అమ్ముకుంటాం..
తల్లాడ: మార్కెట్లోనే మిర్చి విక్రయించాలని రైతులపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని పలువురు పేర్కొన్నారు. ఈమేరకు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యాన మండలంలోని అన్నారుగూడెం కోల్డ్స్టోరేజీల వద్ద మంగళవారం జరిగిన రాస్తారోకోలో పలువురు రైతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సంఘ్ రాష్ట్ర కార్యదర్శి మందరపు రామారావు, జిల్లా అధ్యక్షుదు శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు కోల్డ్ స్టోరేజ్లో మిర్చి అమ్మితే రూ.లక్షకు రూ.1.50 కమీషన్ తీసుకొని నగదు చెల్లిస్తున్నారని తెలిపారు. అదే వైరా మార్కెట్కు వెళ్తే శాంపిళ్లు తీసుకెళ్లాక నచ్చితే మరుసటి రోజు తీసుకురావాలని సూచిస్తుండగా, లక్షకు రూ.3 నుంచి రూ.5 కమీషన్ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈమేరకు రైతులు కోల్డ్ స్టోరేజీల్లో అమ్ముకునే అవకాశం కల్పించాలని, మార్కెట్ యార్డ్ నుంచి కోల్డ్ స్టోరేజీలకు పంపిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, రాస్తారోకోతో పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోగా పోలీసులు నచ్చచెప్పి విరమింపజేశారు. ఆతర్వాత అనుమతి లేకుండా రాస్తారోకో చేయడంపై నాయకులు మందరపు రామారావు, ప్రగడవరపు శ్రీనివాసరావుతో పాటు కట్టా ఖాదర్బాబా, బండారు సత్యనారాయణ, కొండపల్లి నరేష్పై తదితరులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.

అమెరికాది యుద్ధోన్మాదం..

అమెరికాది యుద్ధోన్మాదం..