
ప్రైవేట్ పాఠశాల గోదాం సీజ్
సత్తుపల్లి: సత్తుపల్లిలోని నారాయణ స్కూల్లో అనుమతి లేకుండా పుస్తకాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎంఈఓ నక్కా రాజేశ్వరరావు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ విషయమై తొలుత ఏఐఎస్ఎఫ్ నాయకులు పాఠశాల ఎదుట ధర్నా చేశారు. దీంతో సమాచారం అందుకున్న ఎంఈఓ తనిఖీలు చేపట్టి పుస్తకాలు విక్రయిస్తున్నట్లు నిర్ధారించి గోదాంను సీజ్ చేశారు. ఈమేరకు ఎంఈఓ రాజేశ్వరరావు మాట్లాడుతూ నారాయణ స్కూల్తో సహా మరికొన్ని విద్యాసంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. నారాయణ స్కూల్పై ఫిర్యాదు అందడంతో గోదాంను సీజ్ చేసి డీఈఓకు నివేదిక ఇచ్చామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, టై, బెల్ట్లు, షూలు విక్రయిస్తున్నారని తెలిపారు. కాగా, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫామ్ అమ్మకుండా అధికారులు పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో శివనాయక్, వంశీ, మనోజ్, అన్నవరపు ఉపేంద్ర, రామకృష్ణ, దేవేందర్, రామ్చరణ్ పాల్గొన్నారు. అయితే, సత్తుపల్లిలోని పలు పాఠశాలల్లో నోట్పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, యూని ఫామ్, టైలు, బెల్డ్లు, షూ అధిక ధరలకు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేస్తేనే తనిఖీలు చేపట్టడం, మిగతా స్కూళ్లపై దృష్టి సారించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అలాగే, పాఠశాలల తీరుతో తాము ఉపాధి కోల్పోతున్నామని దుకాణాల యజమానులు వాపోతున్నారు.