
సులువుగా కాపాడేలా..
● అగ్నిమాపకశాఖకు రెండు రెస్క్యూ బోట్లు ● శిక్షణ పొందుతున్న ఉద్యోగులు
ఖమ్మంక్రైం: గత ఏడాది మున్నేటికి అనూహ్యంగా వచ్చిన వరద ఖమ్మం కార్పొరేషన్తో పాటు ఖమ్మం రూరల్ మండలాల్లోని పలు కాలనీల ప్రజలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. అప్పట్లో ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో సహాయక చర్యలు చేపట్టడానికి బోట్లు, ఇతర సామగ్రి లేక యంత్రాంగానికి ఇక్కట్లు ఎదురయ్యాయి. ఈనేపథ్యాన ఈసారి వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు ముందస్తు చర్యల్లో నిమగ్నమయ్యారు. వరద ముంచెత్తితే ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేలా రాష్ట్ర అగ్నిమాపక శాఖ జిల్లాకు రెండు ప్రత్యేక రెస్క్యూ బోట్లను కేటాయించింది.
జిల్లాకు రెండు ఐఆర్బీ బోట్లు...
గత ఏడాది పరిస్థితుల దృష్ట్యా జిల్లా అగ్నిమాపక శాఖకు ఉన్నతాధికారులు రెండు ఐఆర్బీ(ఇన్ప్లేటబుల్ రెస్క్యూ బోట్లు)లను సమకూర్చారు. ప్రత్యేకంగా తయారు చేసిన ఈ బోట్ల ద్వారా నదులు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నా అందులో చిక్కుకున్న వారిని సులువుగా తీసుకురావడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఒక్కో బోట్లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది వెళ్లి ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చే అవకాశముంది. అంతేకాక బోట్లు, ఇతర సామగ్రిని వరద ప్రభావిత ప్రాంతాలకు చేర్చేలా ఒక వాహనాన్ని సైతం అగ్నిమాపక శాఖ కేటాయించింది.
ఉద్యోగులకు శిక్షణ
బోట్ల నిర్వహణ, వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి తీసుకురావంతో ఇటీవల హైదరాబాద్లోని ఎన్డీఆర్ఎఫ్ కేంద్రంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది పలువురికి విడతల వారీగా శిక్షణ ఇచ్చారు. అంతేకాక స్థానిక పరిస్థితులు అవగాహన వచ్చేలా ఖమ్మంలోని మున్నేరుతోపాటు లకారం తదితర పెద్ద చెరువుల్లో బోట్ల ద్వారా శిక్షణ పొందుతున్నారు.
మరిన్ని బోట్ల కోసం ప్రతిపాదించాం..
గత ఏడాది మున్నేరుకు వచ్చిన వరదల దృష్ట్యా జిల్లాకు ప్రత్యేక బోట్లు కావాలని కోరడంతో అగ్నిమాపకశాఖ అడిషనల్ డీజీ ినాగిరెడ్డి రెండు ప్రత్యేక బోట్లు కేటాయించారు. అయితే, జిల్లాకు మరిన్ని బోట్లు కావాలని కోరగా సానుకూలంగా స్పందించారు. వీటి ద్వారా వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడంపై ఉద్యోగులకు శిక్షణ కొనసాగుతోంది.
– అజయ్, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి

సులువుగా కాపాడేలా..