
సిద్ధాంతం ఎన్నటికీ చావదు..
● వామపక్ష లౌకిక శక్తుల ఐక్యతే ప్రత్యామ్నాయం ● గిరిప్రసాద్ వర్ధంతి సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
ఖమ్మంమయూరిసెంటర్: సిద్ధాంతాన్ని ఆచరిస్తున్న కొందరికి హత్య చేయడం సాధ్యమేమో కానీ ఆ సిద్ధాంతాన్ని చంపేయడం అంత తేలిక కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వెల్లడించారు. ఖమ్మం రిక్కాబజార్ హైస్కూల్ మైదానంలో శనివారం సాయంత్రం నిర్వహించిన నల్లమల గిరిప్రసాద్ వర్ధంతి సభలో పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ.. మావోయిస్టుల సిద్ధాంతాన్ని తాము వ్యతిరేకించినా.. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని వేలాది మంది ఉన్నారని, వారిని చంపినా మళ్లీ పుట్టుకొస్తారని తెలిపారు. ఇదే సమయాన మావోయిస్టులు సైతం తమ పంథాను మార్చుకోవాలని నారాయణ సూచించారు. రాజ్యాంగానికి మావోయిస్టుల నుంచి కానీ మరే ఇతరుల నుంచి కానీ ప్రమాదం లేదని, ఆ ప్రమాదం బీజేపీ వైపు నుంచే పొంచి ఉందని అభిప్రాయపడ్డారు.
క్రమశిక్షణ, నిబద్ధతకు మారుపేరు గిరిప్రసాద్
నాడు సాయుధ పోరాటంలో వేల మందిలాగే గిరిప్రసాద్ను సైతం హతమార్చాలని ప్రయత్నిస్తే తుపాకీ గుండుకు ఎదురొడ్డి నిలిచారని నారాయణ తెలిపారు. క్రమశిక్షణ, నిబద్ధతకు మారుపేరుగా ఆయన నిలిచారని, తుది శ్వాస వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడారని చెప్పారు. నియంత పాలనకు ప్రయత్నాలు జరుగుతున్న ఈ తరుణంలో ప్రజా చైతన్యానికి వామపక్ష ఉద్యమం బలపడాలని పిలుపునిచ్చారు. కాగా, హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని అన్నందుకు కొందరు అవాకులు, చెవాకులు పేలారని.. ఇప్పుడు మిస్ ఇంగ్లాండ్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోటీల్లో పాల్గొనే వారిని వేశ్యల్లా చూస్తున్నారని చెప్పిందన్నారు.
చర్చలపై స్పందించరా?
మావోయిస్టులు శాంతిచర్యలకు ప్రతిపాదిస్తున్నా కేంద్రప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. తెలంగాణ చైతన్యానికి ప్రతీక అని.. ఈ గడ్డపై మతోన్మాదం, కుల మత రాజకీయాలకు స్థానం లేదని స్పష్టం తొలుత ఖమ్మం పాత బస్టాండ్ వద్ద గిరిప్రసాద్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా, భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, గిరిప్రసాద్ తనయుడు నల్లమల చక్రవర్తి, నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, మిరియాల రంగయ్య, యర్రా బాబు, శింగు నర్సింహారావు, బీ.జీ.క్లెమెంట్, పోటు కళావతి, మహ్మద్ సలాం, జానీమియా, తాటి వెంకటేశ్వరరావు, సిహెచ్ సీతామహాలక్ష్మి, తోట రామాంజనేయులు, ఇటికాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.