
సమపాళ్లలో సంక్షేమం, అభివృద్ధి
తిరుమలాయపాలెం/కూసుమంచి: సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో చేపడుతూ తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తిరుమలాయపాలెం మండలంలోని రాకాసి తండా – మన్నెగూడెం, పాతర్లపాడు క్రాస్ – రావి చెట్టు తండా, మహ్మదాపురంలో బోడతండా – సుబ్లేడు, మేడిదపల్లి రోడ్డు – భవాని గుడి వరకు రహదారులతో పాటు తెట్టెలపాడులో అంతర్గత సీసీ రహదారుల నిర్మా ణం, కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో రహదారి నిర్మాణానికి మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూనే సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలుచేయగా, మిగతావి కూడా త్వరలోనే అమలుచేస్తామని తెలిపారు. కాగా, ఇందిరమ్మ కమిటీలు ఇచ్చిన జాబితా ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడత మంజూరు పత్రాలు ఇస్తుండగా, ఎక్కడా పొరపాటు జరగకుండా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకం అమలుచేయనున్నట్లు మంత్రి తెలిపారు. కాగా, మంత్రి తన పర్యటనలో భాగంగా పలువురు ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ, పీఆర్ ఎస్ఈలు యాకూబ్, వెంకట్రెడ్డి, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఆర్డీఓ నర్సింహారావు, ఏడీఏ సరిత, తహసీల్దార్లు లూథర్ విల్సన్, కరుణశ్రీ, ఎంపీడీఓలు సిలార్ సాహెబ్, వేణుగోపాల్రెడ్డితో పాటు చావా శివరామకృష్ణ, రామసహాయం నరేష్రెడ్డి, బెల్లం శ్రీనివాస్, మంగీలాల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి