
ఉపాధ్యాయుల సర్దుబాటు పారదర్శకంగా చేపట్టాలి
ఖమ్మంసహకారనగర్: రానున్న విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని టీపీటీఎఫ్ నాయకులు కోరారు. ఈ సందర్భంగా శనివారం డీఈఓ సామినేని సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏవీ నాగేశ్వరరావు, వెంగళరావు మాట్లాడుతూ.. గతేడాది ఖాళీగా ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారని, ఆ తర్వాత ఏర్పడిన ఖాళీలను పదోన్నతులు, డీఎస్సీ నియామకాలతో భర్తీ చేశారని తెలిపారు. కానీ నేటికీ కూడా డిప్యూటేషన్పై వెళ్లిన ఉపాధ్యాయులు వారి మాతృస్థానానికి వెళ్లలేదని, తద్వారా ఒకే పాఠశాలలో ఒకే సబ్జెక్టుకు ఇద్దరు ఉపాధ్యాయులు పని చేయాల్సి వస్తోందని చెప్పారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా ప్రక్రియ చేపట్టాలని కోరారు.