
రేపటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
● జిల్లాలో మూడు విడతలుగా శిబిరాలు
ఖమ్మంసహకారనగర్: జిల్లాలోని ఉపాధ్యాయులకు మూడు విడతలుగా వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు డీఈఓ సామినేని సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలి విడత శిక్షణ మంగళవారం నుంచి ఈనెల 17 వరకు, రెండో విడత 20 నుంచి, మూడో విడత 27 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎస్ఏ ఇంగ్లిష్ టీచర్లు 326 మంది, గణితం 453, సోషల్ ఉపాధ్యాయులు 436 మంది, మండల రిసోర్స్ పర్సన్లు 168 మంది, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఐఆర్పీలు 62 మందికి ఖమ్మంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. కాగా, కోర్సుల కో ఆర్డినేటర్లు, రిసోర్స్ పర్సన్లతో సోమవారం సంసిద్ధత సమావేశం ఏర్పాట్లు చేశామని తెలిపారు.
శిక్షణ తరగతులకు ఎంపికై న ఉపాధ్యాయులంతా ఉదయం 9.30 గంటల లోపు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా జియోట్యా గ్డ్ హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని వివరించారు. వర్కింగ్ లంచ్, టిఫిన్, టీ శిక్షణ కేంద్రంలోనే అందజేస్తారని తెలిపారు. శిక్షణ పూర్తిచేసిన ఉపాధ్యాయులు ఆన్లైన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుని సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
బోధించనున్న అంశాలివే..
ఐదు రోజుల శిక్షణ తరగతుల్లో కంటెంట్ ఎన్రిచ్మెంట్, డిజిటల్ ఎడ్యుకేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ స్కిల్స్, లెర్నింగ్ ఔట్కమ్స్ వంటి అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు.
అరుణాచలంలో భద్రాద్రి జిల్లా యువకుడు మృతి
● గిరిప్రదక్షిణ, దర్శనానంతరం
గుండెపోటు
జూలూరుపాడు: జూలూరుపాడుకు చెందిన యువకుడు తమిళనాడులోని అరుణాచలం క్షేత్రంలో గుండెపోటుతో ఆదివారం మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని పాపకొల్లు శ్రీ ఉమాసోమలింగేశ్వరస్వామి ఆలయ ప్రధానార్చకుడు తెలికిచెర్ల మధుకుమార్ శర్మ కుమారుడు రాకేష్ శర్మ(33) హైదరాబాద్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. ఈనెల 9న తల్లి భవానితో కలిసి అరుణాచలం పుణ్యక్షేత్రానికి వెళ్లారు. ఆదివారం అక్కడ గిరి ప్రదక్షిణ చేసి, స్వామివారి దర్శనానంతరం తిరిగి అద్దెకు తీసుకున్న రూమ్కు వెళ్లే క్రమంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఆనంద శ్వేత, మూడేళ్ల కూతురు, ఆరు నెలల కుమారుడు ఉన్నారు. కుమారుడికి ఇటీవలే పాపకొల్లు ఆలయంలో అన్నప్రాసన వేడుక నిర్వహించాక, భార్య.. పిల్లలను తీసుకుని పుట్టింటికి కాకినాడ వెళ్లింది. రాకేశ్ తల్లితో కలిసి దైవ దర్శనానికి వెళ్లగా, అక్కడే తుదిశ్వాస విడిచాడు. కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు మధుకుమార్ శర్మ అరుణాచలం బయలుదేరారు. సోమవారం సాయంత్రానికి జూలూరుపాడు చేరుకోనున్నారు. కాగా, మాతృ దినోత్సవం రోజునే పుత్రుడికి కోల్పోయిన తల్లి భవానీ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతడి మృతితో జూలూరుపాడు, పాపకొల్లు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.
భార్య మరణాన్ని
తట్టుకోలే ని భర్త..
కామేపల్లి: మండలంలోని ఊట్కూర్ గ్రామానికి చెందిన తాళ్లూరి చిన్న వెంకటరత్నమ్మ(75) రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మృతిని తట్టుకోలేక మనోవేదనకు గురైన ఆమె భర్త తాళ్లూరి సత్యమయ్య(85) ఆదివారం మృతి చెందాడు. రెండు రోజుల వ్యవధిలోనే వృద్ధ దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
మృతదేహం గుర్తింపు
ఖమ్మంక్రైం: నగరంలోని వన్టౌన్ పరిధిలో ఈ నెల 3న పురుగు మందు తాగి మృతిచెందిన ఓ వ్యక్తిని వన్టౌన్ పోలీసులు గుర్తించారు. సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడ వెంకటగిరికి చెందిన ప్రభాకర్ మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో మనస్తాపం చెంది ఈనెల 2న పాత బస్టాండ్ సమీపాన పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే మృతుడి చిత్రాన్ని సామాజిక మాద్యమాల్లో చూసిన కుటుంబసభ్యులు ఆదివారం గుర్తించి పోలీసులను ఆశ్రయించగా.. కొడుకు వినోద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.