
ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు గాను ఉమ్మడి జిల్లా స్థాయి బాలబాలికల చెస్ జట్లను ఎంపిక చేశారు. చెస్ అసోసియేషన్ ఆధ్వర్యాన బుధవారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అండర్–7, 9, 11 కేటగిరీల్లో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా ప్రతిభ చాటిన వారితో జిల్లా జట్లు ఎంపిక చేశామని చెస్ అసోసియేషన్ బాధ్యులు తెలిపారు. ఉమ్మడి జిల్లా అండర్–7 బాలబాలికల జట్లకు ప్రీతమ్, జుహిత్, ఆరాధ్య, శ్రియశ్రీ, అండర్–9 విభాగంలో నిఖిల్, విహాన్, కృతిప్రీతిక, హరిప్రియశ్రీ, అండర్–11 విభాగంలో అక్షయ్కుమార్, సీహెచ్.గౌతమ్కృష్ణ, హిమశ్రీనిక, రీతూశ్రీ ఎంపికయ్యారు. ఈ పోటీలను అసోసియేషన్ బాధ్యులు సీహెచ్.గోపీకృష్ణ, సాంబశివరావు, రామారావు, అరుణ, స్వాతి, భిస్వజిత్, కృష్ణ, జ్యోత్స్న పర్యవేక్షించారు.
నేడు జిల్లాకు
మాజీ మంత్రి కేటీఆర్
తల్లాడ: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం తల్లాడ మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 11–30 గంటలకు తల్లాడ మండలం రేజర్లకు హెలీకాప్టర్లో రానున్న ఆయన అక్కడి నుంచి రోడ్డుమార్గంలో మిట్టపల్లికి చేరుకుని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల శేషగిరిరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆతర్వాత అక్కడే జరిగే సభలో మాట్లాడాక తిరిగి రోడ్డు మార్గంలో రేజర్లకు, హెలీకాప్టర్లో హైదరాబాద్ బయలుదేరతారు. కాగా, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పర్యవేక్షణలో విగ్రహావిష్కరణ, సభ ఏర్పాట్లు పూర్తిచేశారు. సభకు వచ్చే వారు ఎండ కారణంగా ఇబ్బంది పడకుండా షామి యానాలు, కూలర్లు అమరుస్తున్నారు. ఇక విగ్రహావిష్కరణ సందర్భంగా హాజరయ్యే వారికి శేషగిరిరావు కుటుంబీకులు అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
మేలైన విత్తనాల ఎంపికతో మంచి దిగుబడి
చింతకాని: రైతులు పంటల సాగు సమయాన శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పాటిస్తే మేలైన దిగుబడులు సాధించొచ్చని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. చింతకానిలోని రైతువేదికలో గురువారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’లో భాగంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం, మేలురకపు విత్తనాలను ఎంపికతో మంచి ఫలితాలు వస్తాయన్నారు. అలాగే, విత్తనాలు, ఎరువుల రశీదులను పంట పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలని, ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. వైరా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ఎరువులను అవసరం మేరకు వాడుతూ నేల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని తెలిపారు. శాస్త్రవేత్తలు డాక్టర్ చైతన్య, ఫణిశ్రీ, ఆయిల్ఫెడ్ జిల్లా మేనేజర్ రామకృష్ణ, ఏడీఏ విజయ్చంద్ర, ఉద్యాన అధికారి విష్ణు, ఏఓ మానస, పశువైద్యాధికారి రాంజీ పాల్గొన్నారు.
వైరా ఏసీపీగా సారంగపాణి
వైరా: వైరా ఏసీపీ ఎం. ఏ.రెహమాన్ను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఆయన స్థానంలో హైదరాబాద్ పోలీస్ అకాడమీలో పనిచేస్తున్న ఎస్.సారంగపాణిని నియమించారు. సుమారు మూడేళ్ల పాటు ఇక్కడ విధులు నిర్వర్తించిన రెహమాన్ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన మరో నాలుగు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనుండగా, బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
●ఖమ్మం క్రైం: ఖమ్మం సీసీఆర్బీ ఏసీపీ పి.రవీందర్రెడ్డిని వరంగల్ జిల్లా నర్సంపేట ఏసీపీగా బదిలీ చేశారు. అయితే, ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు.