
అదే ర్యాంక్.. పెరిగిన శాతం
● ఎస్సెస్సీ ఫలితాల్లో బాలికలదే హవా ● రాష్ట్రంలో 21వ స్థానాన నిలిచిన జిల్లా ● గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ ఉత్తీర్ణత
ఖమ్మం సహకారనగర్: పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు సైతం ఉత్తమ మార్కులు సాధించగా, ప్రైవేట్ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి. గతేడాది జీపీఏ గ్రేడింగ్ విధానంలో ఫలితాలు వెల్లడించిన ప్రభుత్వం, ఈసారి మార్కుల వారీగా విడుదల చేసింది. బుధవారం మధ్యాహ్నం ఫలితాలు వెల్లడి కాగానే విద్యార్థులు ఆన్లైన్లో చూసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఏటా మాదిరిగానే ఈసారి సైతం బాలురతో పోలిస్తే బాలికలు ఉత్తీర్ణతలో ముందు నిలిచారు.
94.47శాతం ఉత్తీర్ణత
ఈ ఏడాది జిల్లా నుంచి 16,391మంది ఎస్సెస్సీ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 15,485మంది ఉత్తీర్ణత సాధించగా 94.47శాతంతో రాష్ట్రస్థాయిలో జిల్లాకు 21వ స్థానం దక్కింది. గత ఏడాది 92.24శాతం ఉత్తీర్ణతతో 21వ స్థానంలో నిలిచింది. ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగినా ర్యాంక్ మాత్రం 21తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా, ఎప్పటిలాగే ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. అయితే, కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదవడం విశేషం.
●గురుకుల విద్యార్థుల ప్రతిభ
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ సంక్షేమ గురుకులాల విద్యార్థులు ప్రతిభ కనబరి చారు. దానవాయిగూడెం ఎంజేపీబీసీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థిని టి.దుర్గాభవాని 593 మార్కులతో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటింది. జిల్లాలోని 22బీసీ గురుకులాల నుంచి 1,351 మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 1,314 మంది ఉత్తీర్ణత(97.26 శాతం) సాధించారని.. పది గురుకులాల్లో వంద శాతం మంది పాస్ అయ్యారని ఆర్సీఓ సీహెచ్.రాంబాబు తెలిపారు. ఇక జిల్లాలోని 12 ఎస్సీ గురుకులాలకు గాను 923 మంది పదో తరగతి విద్యార్థులకు 900 మంది (97.50శాతం) ఉత్తీర్ణత సాధించారు. కల్లూరు, ఎర్రుపాలెం, కూసుమంచి, ముదిగొండ గురుకుల పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే, ఏడు మైనార్టీ గురుకులాల నుంచి 367 మంది ఎస్సెస్సీ పరీక్షలకు హాజరుకాగా, 350 మంది(95.36 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మైనార్టీ గురుకులాల విభాగంలో ఖమ్మం గర్ల్స్–2, మధిర బాయ్స్–1 గురుకుల పాఠశాలల నుంచి పరీక్షలకు హాజరైన విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు.
పదో తరగతి ఫలితాలు ఇలా...
కేటగిరి విద్యార్థులు ఉత్తీర్ణులు శాతం
బాలురు 8,408 7,858 93.46
బాలికలు 7,983 7,627 95.54
మొత్తం 16,391 15,485 94.47