ములుగు జిల్లా మత్స్యకారులకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ములుగు జిల్లా మత్స్యకారులకు శిక్షణ

Mar 27 2025 1:39 AM | Updated on Mar 27 2025 1:33 AM

కూసుమంచి: మండలంలోని పాలేరు పీ.వీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో ములుగు జిల్లాకు చెందిన షెడ్యూల్డ్‌ తెగల మత్స్యకారుల మూడో బ్యాచ్‌ శిక్షణ బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ చేపల పెంపకంలో పద్ధతులు, సంరక్షణపై అవగాహన కల్పించారు. మత్స్యకారులు మూడు రోజుల పాటు కొనసాగే శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అనంతరం క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా ఫిషరీస్‌ కేంద్రాలను సందర్శించి వివిధ రకాల చేపలు, రొయ్యల పెంపకం, వ్యాధుల నివారణ, దాణా తయారీ విధానాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

చేగొమ్మ నర్సరీలో 3న మామిడికాయల వేలం

కూసుమంచి: మండలంలోని చేగొమ్మ ప్రభుత్వ ఉద్యాన నర్సరీలో 500 చెట్ల మామిడి కాయల విక్రయానికి వచ్చేనెల 3వ తేదీన బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఉద్యానవన శాఖ అధికారి అపర్ణ తెలిపారు. వేలంలో పాల్గొనే వారు రూ.5వేల నగదు డిపాజిట్‌ చెల్లించాలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు వివరాల కోసం 89777 14104 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

‘పాలకుల తీరుతోనే రైతుల ఆత్మహత్యలు’

ఖమ్మంమయూరిసెంటర్‌: పాలకుల విధానాల ఫలితంగానే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదిరాజు రమేష్‌ పేర్కొన్నారు. ఖమ్మంలోని బోడేపూడి విజ్ఞానకేంద్రంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి వెన్నెముక అయిన రైతులు ఇప్పుడు దివాలా స్థితికి చేరారని.. కేంద్ర, రాష్ట్ర పాలకులు సరైన సహకారం అందించకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురవుతుందని చెప్పారు. సరళీకృత విధానాల్లో భాగంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడమే కాక సబ్సిడీలు తగ్గించారని, కనీస మద్దతు ధర ప్రకటించడం లేదని తెలిపారు. ఇకనైనా స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులు అమలుచేసి ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో నాయకులు వై.శ్రీనివాసరావు, ఎం.సుబ్బారావు, ఎస్‌.కే.అఫ్జల్‌మియా, జి.రామారావు, వాసిరెడ్డి వీరభద్రం, టి.వెంకట్రావు, నెల్లూరు వీరబాబు, టి.శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌తో

జిల్లా నేతల భేటీ

ఖమ్మంవన్‌టౌన్‌: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌తో బుధవారం జిల్లా, ఖమ్మం నగర నాయకులు ఢిల్లీలో భేటీ అయ్యారు. అక్కడి యువజన కాంగ్రెస్‌లో కార్యాలయంలో ఆమెను కలిసిన వారు నామినేటెడ్‌ పదవుల్లో పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్‌ జిల్లా, నగర అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మహ్మద్‌ జావీద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీలో శిక్షణకు

డైట్‌ ప్రిన్సిపాల్‌

ఖమ్మంసహకారనగర్‌: ఢిల్లీలో నీతి ఆయోగ్‌ ద్వారా ఏర్పాటు చేసిన వర్క్‌షాపు, శిక్షణకు రాష్ట్రంలోని ముగ్గురు డైట్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆహ్వానించారు. ఇందులో ఖమ్మం డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సామినేని సత్యనారాయణకు అవకాశం దక్కింది. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఢిల్లీలో ‘నేషనల్‌ వర్క్‌షాపు ఆన్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌’అనే అంశంపై జరిగిన శిక్షణకు హాజరయ్యారు.

నిలిచిన డిజిటల్‌ పేమెంట్లు

ఖమ్మంగాంధీచౌక్‌: ప్రస్తుతం నగదు చెల్లింపుల కు అందరూ డిజిటల్‌ విధానాన్ని ఉపయోగించుకుంటుండగా.. బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి ఆ సేవలు నిలిచిపోయాయి. సర్వర్‌ పనిచేయకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. దీంతో ఫోన్‌ పే, గుగుల్‌ పే వంటి యాప్‌లు పనిచేయక ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లోనే కాక వినియోగదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రీచార్జ్‌, బిల్లుల చెల్లింపు వంటిని నిలిచిపోయాయి. అయితే, రాత్రి 9 గంటల సమయాన సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయని బ్యాంకుల ప్రతినిధులు తెలిపారు.

కేసు నమోదు

ఖమ్మంరూరల్‌: మండలంలోని జలగంనగర్‌కు చెందిన షేక్‌ బషీర్‌పై అదే గ్రామానికి చెందిన ముగ్గురు దాడి చేయగా హత్యాయత్నం కేసు నమోదైంది. గ్రామానికి చెందిన బషీర్‌ కుమారుడైన హుస్సేన్‌ స్థానిక మసీదు నిర్వహణపై తరచుగా ప్రశ్నిస్తున్నాడు. దీనిని మనసులో పెట్టుకుని ఈనెల 23న హుస్సేన్‌ను స్థానికుడైన షేక్‌ మోసీన్‌ఖాన్‌ కొట్టాడు. అంతేకాక బషీర్‌, హుస్సేన్‌ ఈ నెల 25న నమాజ్‌కు వెళ్తుండగా మోసీన్‌ఖాన్‌, ఇమ్రాన్‌, రిజ్వాన్‌ దాడి చేయగా బషీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement