ఖమ్మం సహకారనగర్: పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో 97కేంద్రాలు ఏర్పాటుచేయగా, 16,438మంది విద్యార్థులకు గాను 16,408మంది హాజరయ్యారు. మరో 30మంది గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఉదయం 9–30నుంచి మధ్యాహ్నం 12–30గంటల వరకు జరిగే పరీక్షకు 8–30గంటల నుంచే అనుమతిస్తామని చెప్పడంతో విద్యార్థులు ముందుగానే చేరుకున్నారు. కాగా, పరీక్షా కేంద్రాల వద్ద నోటీస్ బోర్డుపై విద్యార్థుల హాల్టికెట్లతో నంబర్లు, గదుల నంబర్ల వివరాలతో పాటు ఎంఈఓ, డీఈఓల ఫోన్నంబర్లు రాయాల్సి ఉంది. కానీ పలు కేంద్రాల వద్ద అధికారుల నంబర్లు లేని అంశాన్ని డీఈఓ సోమశేఖరశర్మ దృష్టికి తీసుకెళ్లగా అన్ని కేంద్రాల బాధ్యులకు సూచనలు చేస్తామని తెలిపారు.
తొలుత ఆలయాల్లో పూజలు
విద్యార్థి దశలో కీలకమైన పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు తొలుత హాల్టికెట్లతో ఆలయాల్లో పూజలు చేశారు. ఆతర్వాత తల్లిదండ్రులతో కలిసి పరీక్షా కేంద్రాలకు చేరుకోగా, పిల్లలకు వారు జాగ్రత్తలు చెప్పి వెనుదిరిగారు.
అబ్జర్వర్ సందర్శన
జిల్లాలో పలు పరీక్షా కేంద్రాలను ఉమ్మడి జిల్లా పరీ క్షల అబ్జర్వర్ విజయలక్ష్మీబాయి సందర్శించారు. కూసుమంచి, ఖమ్మం నయాబజార్, రిక్కాబజార్ కేంద్రాలను తనిఖీ చేసిన ఆమె ఏర్పాట్లపై ఆరా తీశారు. అలాగే, డీఈఓ సోమశేఖరశర్మ ఏడు, అసిస్టెంట్ కమిషనర్ ఒకటి, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 38 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయి.
ముందుగానే చేరుకున్న విద్యార్థులు
తొలిరోజు 30మంది గైర్హాజరు
ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభం
ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభం