ప్రతీ మనిషికి 100 లీటర్లు | - | Sakshi
Sakshi News home page

ప్రతీ మనిషికి 100 లీటర్లు

Mar 22 2025 12:07 AM | Updated on Mar 22 2025 12:06 AM

● వేసవిలోనూ సాఫీగా తాగునీటి సరఫరా ● గత ఏడాదితో పోలిస్తే 20శాతం అధికంగా నీరు ● పైపులైన్‌ లేనిచోట్ల ప్రత్యామ్నాయ మార్గాలు ● మిషన్‌ భగీరథ ఎస్‌ఈ గడ్డం శేఖర్‌రెడ్డి

ఖమ్మంవన్‌టౌన్‌: ఎండలు ముదురుతున్న నేపథ్యాన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తాగునీటి సరఫరాకు ఇక్కట్లు ఎదురుకాకుండా ప్రణాళికాయుతంగా వ్యవహరించనున్నట్లు మిషన్‌ భగీరథ ఎస్‌ఈ గడ్డం శేఖర్‌రెడ్డి వెల్లడించారు. వచ్చే ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లోనూ ప్రజలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందించేలా తమ శాఖ అధికారులు, సిబ్బంది ఇప్పటికే సమాయత్తమయ్యారని తెలిపారు. కొద్దిరోజుల క్రితం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క నేతృత్వాన హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో చేసిన సూచనల మేరకు గత నెలలోనే ముందస్తుగా క్షేత్రస్థాయిలో పరిశీలించామని ఎస్‌ఈ చెప్పారు. మిషన్‌ భగీరథ ఎస్‌ఈగా బాధ్యతలు స్వీకరించిన ఆయన వేసవి సన్నద్ధతపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. ఈమేరకు ఎస్‌ఈ వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే...

22గ్రామాలకు స్థానిక వనరులతో...

ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,530 గ్రామాలకు గాను ఖమ్మం జిల్లాలో 931 గ్రామాలు ఉన్నాయి. ఇందులో ఏడు గ్రామాలకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా కాకుండా స్థానిక వనరులతో నీరు అందిస్తున్నాం. అలాగే, భద్రాద్రి జిల్లాలోని 1,599 గ్రామాలకు గాను 15గ్రామాల్లో స్థానికంగానే నీరు సమకూరుస్తున్నాం.

వేసవికి ప్రత్యేక ప్రణాళిక

వేసవి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గత నెల రోజులుగా ప్రణాళికలు సిద్ధం చేశాం. గత నెలలోనే ఉద్యోగులంతా పది రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. తద్వారా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా యో గుర్తించి ప్రభుత్వానికి నివేదించగా.. ఆయా ఆవాసాల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరాకు అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోనున్నాం.

జోన్లుగా గ్రామాల విభజన

ఉమ్మడి జిల్లాలో ప్రతీ మనిషికి 100 లీటర్ల తాగునీరు అందించాలనేది లక్ష్యం. ఈ స్థాయిలో నీరు అందుతున్న గ్రామాలను గ్రీన్‌ జోన్‌గా గుర్తించాం. ఇక 55–100లీటర్లు అందించే గ్రామాలను ఆరెంజ్‌ జోన్‌గా, 20–55లీటర్లు అందించే గ్రామాలను ఎల్లో జోన్‌గా, 20లీటర్ల కంటే తక్కువ సరఫరా అవుతున్న గ్రామాలను రెడ్‌జోన్‌గా విభజించాం. అయితే, గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికై తే 20 శాతం నీరు అధికంగానే ఉంది. మిషన్‌ భగరథ పైప్‌లైన్‌ ఉన్న గ్రామాలకు గ్రిడ్‌ ద్వారా, లేనిపక్షంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీరు సరఫరా చేస్తున్నాం.

మారుమూల పల్లెలకు సైతం...

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని మారుమూల పల్లెల్లోనూ ఇప్పటికే స్థానికంగా ఉన్న వనరుల ద్వారా నీరు సరఫరా చేస్తున్నాం. ఆదివాసీ గూడెంల్లో సైతం బోర్లు వేసి సోలార్‌ ప్యానళ్ల ద్వారా నిరంతరాయంగా నీరు అందిస్తున్నాం. త్వరలోనే ఆయా ప్రాంతాలకు సైతం గ్రిడ్‌ ద్వారా నీరు ఇవ్వాలనేది లక్ష్యం. లేకపోతే బోర్లు, బావులు.. అవీ అందుబాటులో లేకపోతే వ్యవసాయ బావులను అద్దె ప్రాతిపదికన తీసుకుంటాం, ఇవన్నీ సాధ్యం కాకపోతే చివరగా ట్యాంకర్లు పంపిస్తాం.

అందరి సమన్వయంతో...

పోలీసు, అగ్నిమాపక, వైద్య, ఆరోగ్య శాఖ మాదిరిగానే మా శాఖ సైతం ఎమర్జెన్సీ విభాగమే. అందుకే నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎక్కడ సమస్య ఎదురైనా వెంటనే మరమ్మతులు చేసి నీటిసరఫరా పునరుద్ధరిస్తున్నాం. గతంలో జగిత్యాల జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎస్‌ఈగా చేరినందున ఉమ్మడి జిల్లా అంతటా పరిశీలించి అధికారులు, సిబ్బంది సయన్వయంతో రానున్న మూడు నెలలు నీటి ఎద్దడి ఎదురుకాకుండా చూడడమే లక్ష్యం.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మిషన్‌ భగీరథ సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌(ఎస్‌ఈ)గా గడ్డం శేఖర్‌రెడ్డి శుక్రవారం విధుల్లో చేరారు. ఖమ్మం ఎన్నెస్పీ క్యాంపులోని ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాల జిల్లాలో ఈఈగా పనిచేస్తున్న శేఖర్‌రెడ్డిని ఎస్‌ఈగా పదోన్నతిపై ఖమ్మం సర్కిల్‌కు కేటాయించారు. దీంతో విధుల్లో చేరగా.. మిషన్‌ భగీరథ ఈఈ పుష్పలత, గ్రిడ్‌ ఈఈ వాణిశ్రీ, కొత్తగూడెం ఈఈ నళిని, డీఈలు, ఏఈలు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతీ మనిషికి 100 లీటర్లు1
1/2

ప్రతీ మనిషికి 100 లీటర్లు

ప్రతీ మనిషికి 100 లీటర్లు2
2/2

ప్రతీ మనిషికి 100 లీటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement