● యథాతధంగానే ప్రస్తుత ధరలు ● బహిరంగ విచారణలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో విద్యుత్ చార్జీల పెంపుపై స్పష్టత వచ్చింది. హనుమకొండలో బుధవారం 2025–2026 ఆర్థిక సంవత్సరానికి సవరణ చేసిన రిటైల్ సప్లయి వ్యాపారానికి సమగ్ర ఆదాయ ఆవశ్యకత, ధరలు, క్రాస్ సబ్సిడీ సర్చార్జీల ప్రతిపాదనలపై బహిరంగ విచారణ జరిగింది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ అధ్యక్షతన జరిగిన ఈ విచారణలో విద్యుత్ టారిఫ్ల ప్రతిపాదనలను టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. 2025–2026 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ పెంపుదలపై ఎలాంటి ప్రతిపాదనలూ చేయలేదని, ప్రస్తుత ధరల్లో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీని ఎంచుకునే ఎల్టీ, హెచ్టీ వినియోగదారులకు సాధారణ టారిఫ్ కంటే యూనిట్కు రూ.0.66 గ్రీన్ టారిఫ్ విధింపు కొనసాగుతుందని తెలిపారు. ఓపెన్ యాక్సెస్లో విద్యుత్ కొనుగోలు చేసి ఎన్పీడీసీఎల్ విద్యుత్ లైన్లు వినియోగించుకున్న వినియోగదారులకు ఎనర్జీ చార్జీల్లో 10 శాతం చొప్పున స్టాండ్ బై చార్జీల విధింపు కొనసాగిస్తున్నామని వెల్లడించారు. టీజీ ఎన్పీడీసీఎల్ నిర్వహణకు 2025–2026 ఆర్థిక సంవత్సరంలో రూ.19,814 కోట్ల ఆదాయ ఆవశ్యకత ఉందని తెలిపారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత టారిఫ్(టారిఫేతర ఆదాయం కలుపుకుని) రూ.9,421కోట్ల వస్తుందని అంచనా వేయగా, రూ.10,393 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని వివరించారు.