కొణిజర్ల: కొణిజర్ల మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా 2023–24 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన పనులపై సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఓపెన్ ఫోరమ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పీడీ చుంచు శ్రీనివాసరావు పాల్గొని సామాజిక తనిఖీ బృందాలు గుర్తించిన అంశాలపై ఆరా తీశారు. పలు గ్రామాల్లోని మస్టర్లలో కొట్టివేతలు, మార్పులు కనిపించాయని ఆయన తెలిపారు. అలాగే, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలకు కూడా ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లినట్లుగా మస్టర్లు వేశారని పేర్కొన్నారు. మొక్కలు నాటినట్లు నమోదు చేసిన ప్రదేశాల్లో మొక్కలు కానరాలేదని తనిఖీ బృందాలు గుర్తించాయని పేర్కొన్నారు. ఈమేరకు బాధ్యులైన సిబ్బంది నుంచి రూ.1.20లక్షల రికవరీకి ఆదేశించగా, ఆయా ప్రాంతాల్లో కొత్త మొక్కలు నాటాలని ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఏపీడీ రామకృష్ణ, ఏడీవీఓ పవన్, అంబుడ్స్మెన్ రమేష్, క్వాలిటీ కంట్రోల్ అధికారి వీరయ్య, ఎంపీడీఓ రోజారాణి, ఎస్ఆర్పీ సాంబశివాచారి, పంచాయతీరాజ్ ఏఈలు రమేష్, కిషోర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మండలంలో కొత్తగా జాబ్కార్డులు మంజూరు చేయాలని, ఉపాధి కూలీలకు సకాలంలో నగదు చెల్లించాలని సీపీఎం నాయకులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.
అక్రమాలు జరిగాయని గుర్తింపు,
రికవరీకి ఆదేశం