● గత ఏడాదితో పోలిస్తే రూ.12 కోట్ల పెంపు ● మేయర్, కమిషనర్తో చర్చించిన అధికారులు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థ(కేఎంసీ)కు 2025–26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధవుతున్నాయి. ఈసారి బడ్జెట్ రూ.102 కోట్లకు పైగా ఉంటుందని ఇప్పటికే లెక్కలు గట్టారు. కార్పొరేషన్కు వచ్చే ఆదాయానికి తోడు వ్యయాన్ని బేరీజు వేసుకుని బడ్జెట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.90.82కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా, ఈసారి రూ.12 కోట్ల మేర పెంచారు. కేఎంసీకి జనరల్ ఫండ్తో పాటు ఇతర నిధులు కలిపి వచ్చే ఆదాయాన్ని పొందుపరిచి.. వేతనాలు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ బిల్లులు, రుణాలు, అడ్వాన్సులు, గ్రీన్ బడ్జెట్, పరిపాలన వ్యయం నమోదు చేశారు. అలాగే, విలీన గ్రామాలకు కొంత, వార్డ్ బడ్జెట్ కింద కొంత ఖర్చు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిసింది.
మేయర్తో చర్చ
2025–26 ప్రతిపాదిత బడ్జెట్ సిద్ధం చేసిన కేఎంసీ అకౌంట్స్ విభాగ అధికారులు మేయర్ పునుకొల్లు నీరజతో చర్చించినట్లు తెలిసింది. ఆదాయ, వ్యయ ప్రతిపాదనలు, గతంతో పోలిస్తే పెంపు, 2024–25 రివైజ్డ్ బడ్జెట్ అమలును వివరించినట్లు సమాచారం. అలాగే, కమిషనర్ అభిషేక్ అగస్త్యతోనూ ఈ అంశంపై చర్చించగా, ఈనెల 27 లేదా 29వ తేదీన కేఎంసీ బడ్జెట్ సమావేశం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.