అన్ని రైళ్లూ ఆలస్యమే ! | - | Sakshi
Sakshi News home page

అన్ని రైళ్లూ ఆలస్యమే !

Mar 18 2025 12:37 AM | Updated on Mar 18 2025 12:38 AM

● గంటల తరబడి ప్రయాణికులు పడిగాపులు ● మూడో లైన్‌ పనులే కారణమంటున్న అధికారులు ● పనులు నత్తనడకన సాగుతుండడంతో ఇక్కట్లు

14వ తేదీ రాత్రికి బదులు 15న తెల్లవారుజామున ఒంటి గంటకు

తిరుపతికి చేరిన కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ (రన్నింగ్‌ స్టేటస్‌)

ఖమ్మం రాపర్తినగర్‌: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏడాది కాలంగా కొనసాగుతున్న మూడో లైన్‌ నిర్మాణ పనులు ప్రయాణికులకు తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. రోజుల తరబడి రైళ్లు రద్దు చేయడం.. మిగతా రోజుల్లో గంటల కొద్ది ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు గంటల తరబడి స్టేషన్లలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదంతా ప్రహసనంగా భావిస్తున్న పలువురు రైలు ప్రయాణానికి దూరంగా ఉంటున్నారు. తప్పని పరిస్థితుల్లో ప్రయాణాన్ని ఎంచుకున్నా సమయానికి గమ్యస్థానాలకు చేరలేక... ఆలస్యం కారణంగా సమయం కోల్పోతున్నారు.

ఖమ్మం మీదుగా 107 రైళ్లు

ఖమ్మం రైల్వేస్టేషన్‌ మీదుగా 107 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఇందులో 83 రైళ్లకే ఇక్కడ హాల్టింగ్‌ ఉంది. ఇక్కడి నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులు కృష్ణా, పద్మావతి తదితర రైళ్లను ఎంచుకుంటుండగా గోల్కొండ, శాతవాహన, ఇంటర్‌సిటీ, కోణార్క్‌, హౌరా, గౌతమి, పద్మావతి, చార్మినార్‌, జీ.టీ, వందేభారత్‌, మచిలీపట్నం తదితర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో రోజుకు 13వేల మంది తమ ప్రయాణాలు సాగిస్తుంటారు. అయితే రద్దయినప్పుడు కాకుండా మిగతా రోజుల్లో దాదాపు అన్ని రైళ్లు నిర్ణీత సమయానికి మించి గంట, రెండు గంటలు ఒక్కోసారి అంతకు మించి ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఎక్కువమంది రాకపోకలు సాగించే కృష్ణా, గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో పిల్లాపాపలతో ముందుగానే స్టేషన్లకు చేరుకుంటున్న వారి బాధలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. మూడో రైల్వేలైన్‌ నిర్మాణానికి తోడు స్టేషన్లలోనూ అభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో కూర్చునేందుకు సరిపడ బల్లలు లేక వారి వస్థలు మరింత పెరుగుతున్నాయి.

ఎప్పుడు వెళ్తామో.. ఏమో

ఏడాదికాలంగా ఖమ్మం మీదుగా వెళ్లే రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడవాడాకి మూడే లైన్‌ నిర్మాణ పనులే కారణమని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, చాలా మంది తిరుపతి వెళ్లేందుకు కృష్ణా ఎక్స్‌్‌ప్రెస్‌ను ఎంచుకుంటారు. నిర్ణీత సమయానికి ఈ రైలు నడిస్తే ఉదయం ఖమ్మంకు 10గంటలకు వచ్చి తిరుపతికి రాత్రి 9–40గంటలకు చేరాలి. కానీ గంటల తరబడి ఆలస్యంతో తిరుపతి వెళ్లేసరికి ఒక్కోరోజు అర్ధరాత్రి 12, ఒంటి గంట దాటుతోంది. దీంతో ఆ సమయాన తిరుమల వెళ్లడానికి బస్సులు లేక స్టేషన్‌, ఆరుబయట వేచి ఉండాల్సి వస్తోంది. ఇక దర్శనం అనంతరం తిరుగు ప్రయాణానికి సైతం ముందుగానే టికెట్లు బుక్‌ చేసుకుంటున్న కొందరికి దర్శనం ఆలస్యమై వారు బయలుదేరాల్సిన రైలు అందుకోలేకపోతున్నారు.

ప్రతిరోజు ఆదిలాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ సాఫీగా నడిస్తే ఖమ్మం స్టేషన్‌కు ఉదయం 10గంటలకు చేరాలి. అయితే, గత శుక్రవారం నాలుగున్నర గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 2–30గంటలకు చేరింది. ఇదే రైలు రాత్రి 9–40గంటలకు తిరుపతి చేరుకోవాల్సి ఉన్నా ఆలస్యం కారణంగా అర్ధరాత్రి 12–50 అయింది. దీంతో తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన భక్తులు స్టేషన్‌లోనే పడిగాపులు కాసి శనివారం ఉదయం కొండపైకి వెళ్లాల్సి వచ్చింది. ఇక ఇదే రైలు ఆదివారం 2–20గంటల ఆలస్యంగా మధ్యాహ్నం 12–20కి, సోమవారం 1–10గంటల ఆలస్యంగా 11–10గంటలకు ఖమ్మం చేరుకుంది.

ప్రతిరోజు తిరుపతి – ఆదిలాబాద్‌ మార్గంలో నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ఖమ్మంకు మధ్యాహ్నం 2–51కి రావాలి. కానీ గురువారం మూడు గంటల ఆలస్యంతో సాయంత్రం 5–50కి, శుక్రవారం గంటన్నర ఆలస్యంతో గంటలకు 4–20కి, శనివారం 3–10 గంటల ఆలస్యంతో సాయంత్రం 6గంటలకు వచ్చింది. అలాగే, ఆదివారం 2–50గంటల ఆలస్యంతో సాయంత్రం 5–40కు, సోమవారం కూడా 2–50గంటల ఆలస్యంగా సాయంత్రం 5–40కి చేరింది.

గుంటూరు – సికింద్రాబాద్‌ మధ్య ప్రతిరోజు నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ ఖమ్మంలో షెడ్యూల్‌ ఉదయం 8–34గంటలు కాగా శుక్రవారం 40నిమిషాల ఆలస్యంతో 9–15కు వచ్చింది.

పనులతో తగ్గిన రైళ్ల వేగం

మూడో మూడో లైన్‌ పనుల కారణంగా రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమే. మూడో లైన్‌ నిర్మాణం పూర్తయితే అన్ని రైళ్లు కచ్చితమైన సమయానికి నడుస్తాయి.

– ఎం.డీ.జాఫర్‌, రైల్వే కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌, ఖమ్మం

అన్ని రైళ్లూ ఆలస్యమే !1
1/1

అన్ని రైళ్లూ ఆలస్యమే !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement