కాంగ్రెస్‌లో పెరుగుతున్న అంతర్గత పోరు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో పెరుగుతున్న అంతర్గత పోరు

Mar 16 2025 12:30 AM | Updated on Mar 16 2025 12:27 AM

అధికార కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. పలుచోట్ల ఆధిపత్య పోరుతో విభేదాలు ముదరగా.. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో కార్పొరేటర్లు, నేతల మధ్య వైరం పెరిగి ఎవరికివారు తమదే పైచేయి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పాత, కొత్త నేతలు పెత్తనం కోసం వర్గాలుగా విడిపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈనెల 12న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఓ కార్పొరేటర్‌, మరో నేత మధ్య ‘నువ్వెంత.. అంటే నువ్వెంత’ అనే స్థాయిలో మాటల యుద్ధం జరగడం గమనార్హం. మంత్రి సమావేశంలో ఉంటే మాటెత్తని నేతలు.. ఆయన పరోక్షంలో జరిగే సమావేశాల్లో మాత్రం పెత్తనం కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
● పాత, కొత్త నేతల మధ్య పొసగని వైనం ● అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న కొందరు నేతలు ● ఖమ్మం నియోజకవర్గంలో ముదిరిన విభేదాలు

పైచేయి..

పంచాయితీ

ఎవరి దారి వారిదే..

జిల్లాలో చాలాచోట్ల కాంగ్రెస్‌ పార్టీ నాయకుల మధ్య పొసగడం లేదు. పార్టీలో మొదటి నుంచీ వర్గ పోరు ముఖ్య నేతలకు తలనొప్పిగా మారగా.. అధికారంలోకి వచ్చాక కూడా పరిస్థితిలో మార్పు కానరావడం లేదు. ఖమ్మం నియోజకవర్గంలో అయితే నేతలు తలోదారి అన్నట్లు వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండడం.. ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు, ఎంపీ, రాజ్యసభ సభ్యులు ఉండటంతో కిందిస్థాయి నేతలు వర్గాలుగా విడిపోయారని చెబుతున్నారు. నేతలు ఏ కార్యక్రమం నిర్వహించినా ఎక్కడో అక్కడ అసంతృప్తి బయటపడుతుండడం.. మంత్రులు, ఎంపీలు హాజరయ్యే కార్యక్రమాల్లో వారి వారి అనుచరగణం హడావుడి సర్వసాధారణమైంది.

నేతలు ఎక్కువవడంతో...

ఖమ్మం నియోజకవర్గంలో నేతల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అధిపత్య పోరు నానాటికీ అధికమవుతోంది. జిల్లాకు చెందిన పలువురు నేతలే కాక ఈ నియోజకవర్గానికి చెందిన ఇంకొందరు జిల్లా కేంద్రంగా ఉండే నామినేటెడ్‌ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే అంతర్గత పోరు నెలకొంది. ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని డివిజన్లలో పార్టీ మరింత బలోపేతం కోసం కృషి చేయాలని నాయకత్వం సూచిస్తుండగా.. ఇక్కడి నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటుండడం గమనార్హం. ద్వితీయ శ్రేణి నేతలు కొందరు జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలను నేరుగా కలుస్తూ వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకోవడమే పనిగా పెట్టుకున్నారని చెబుతున్నారు.

పార్టీ కార్యకలాపాలపై ప్రభావం

ఖమ్మం నియోజకవర్గంలో నెలకొన్న విభేదాల ప్రభావం పార్టీ కార్యకలాపాలపై పడుతోందని నాయకత్వం భావిస్తోంది. సమావేశాలు, సభలకు నేతలు, కార్యకర్తలంతా హాజరయ్యే పరిస్థితి ఉండడం లేదు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సైతం జన సమీకరణపై ఎవరికి వారు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈనెల 12న ఖమ్మం 10వ డివిజన్‌లో యూజీడీ శంకుస్థాపనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకాగా.. వెయ్యి మందికి పైగా జనం పాల్గొంటారని అంచనా వేశారు. కానీ సభా ప్రాంగణంలో వందల్లో కూడా ప్రజలు లేకపోవడంతో కార్పొరేటర్లు, నేతలకు మంత్రి తుమ్మల సుతిమెత్తగా చురకలు అంటించినట్లు సమాచారం. అయితే, ఇప్పటికే పరిస్థితి ‘చేయి’ దాటకున్నా దీనికి అడ్డుకట్ట వేసేలా మంత్రి తుమ్మల కఠినంగా వ్యవహరించాలనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

కలవని పాత – కొత్త నీరు

ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలిచిన కార్పొరేటర్లకు.. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కొందరు, విజయం సాధించాక ఇంకొందరు కాంగ్రెస్‌లో చేరారు. వీరితోపాటు మేయర్‌ పునుకొల్లు నీరజ కూడా హస్తం గూటికి వచ్చారు. అయితే కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా గతంలో మాదిరి బీఆర్‌ఎస్‌ నుంచి చేరిన కార్పొరేటర్లదే హవా నడుస్తోందన్న భావన కాంగ్రెస్‌ తరఫున గెలుపొందిన కార్పొరేటర్లలో ఉంది. ఇదే సమయాన పార్టీ మారిన తమ ప్రాబల్యంతోనే కాంగ్రెస్‌ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిందని.. మంత్రి తుమ్మల అందరినీ సమానంగా చూస్తున్నారని పార్టీలో చేరిన కార్పొరేటర్లు, నేతలు తమ అనుయాయులతో చెబుతుండగా, ఇది జీర్ణించుకోలేకే పాత నేతలు వైరానికి కాలు దవ్వుతున్నారనే ప్రచారం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement