
రేపటి నుంచి రెండురాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం చెరువుమాధారంలో శ్రీ అంకమ్మ జాతర సందర్భంగా రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు అమరగాని ఎల్లయ్య తెలిపారు. చెరువుమాధారంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 16నుంచి 18వ తేదీ వరకు జరిగే పోటీల్లో మొదటి ఆరు స్థానాల్లో నిలిచే జట్లకు రూ.30 వేలు, రూ.25వేలు, రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు, రూ.8వేల నగదు బహుమతులు అందిస్తామని పేర్కొన్నారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు ఉచిత భోజన సౌకర్యం ఉంటుందని తెలిపారు. జట్ల వివరాలు నమోదు చేసేందుకు 63026 47907, 81427 14306 నంబర్లలో సంప్రందించాలని సూచించారు. ఈ సమావేశంలో నిర్వహణ కమిటీ ప్రతినిధులు ఈవూరి శ్రీనివాసరెడ్డి, కనమర్లపూడి రాము, తుమ్మా ధనమూర్తి, ఆకుల వెంకటేశ్వర్లు, ఆకుల మల్లేష్, గుంజి రవి తదితరులు పాల్గొన్నారు.
రైసెట్లో ఉచిత శిక్షణ
ఖమ్మంరూరల్: మండలంలోని తరుణి హాట్లో ఉన్న రైసెట్ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యవతకు స్వయం ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ సి.చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో భాగంగా నెల పాటు కొనసాగే లేడీస్ టైలరింగ్లో శిక్షణకు ఈనెల 21నుండి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పించడమే కాక యూనిఫామ్, ట్రైనింగ్ మెటీరియల్, టూల్ కిట్ ఇస్తామని తెలిపారు.
కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
ఖమ్మంవ్యవసాయం: ప్రభుత్వ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో పెరటి తోటల(కిచెన్ గార్డెన్) పెంపకానికి ఉద్యాన యూనివర్సిటీ ఇటీవల ప్రతిపాదించింది. ఈమేరకు ప్రభుత్వం అనుమతిస్తే ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ పర్యవేక్షణలో జిల్లాలోని వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో పెరటి తోటల ద్వారా ఆకుకూరలు, కూరగాయలు, మునగ, కరివేపాకు, పండ్ల మొక్కలు, ఔషధ మొక్కల పెంపకం చేపట్టనున్నారు. తద్వారా విద్యార్థుల్లో పంటల సాగుపై అవగాహన కల్పించడమే కాక, పంటలను వంటల్లో వినియోగానికి అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వానికి ప్రతిపాదన చేసినట్లు ఉద్యాన శాఖ అధికారుల ద్వారా తెలిసింది.
నేడు భీమ్ దీక్షలు ప్రారంభం
నేలకొండపల్లి/ఖమ్మంమయూరిసెంటర్: స్వేరోస్ ఆధ్వర్యాన పలువురు భీమ్ దీక్షను మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రం వద్ద శనివారం స్వీకరించనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 500 మందికి పైగా దీక్ష చేపడతారని చెబుతుండగా, స్వేరోస్ వ్యవస్థాపకుడు, పూర్వ గురుకులాల సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ప్రారంభించనున్నారు. శనివారం నుంచి ఏప్రిల్ 14 వరకు వీరు దీక్షలో ఉంటారని తెలంగాణ స్వేరోస్ కన్వీనర్ బి.దర్గయ్య తెలిపారు. ఈమేరకు క్షేత్రం వద్ద ఆయన ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడుతూ మహానీయులు జయంతి సందర్భంగా 2012 నుంచి దీక్షలు స్వీకరిస్తున్నామని వివరించారు. కాగా, దీక్ష పోస్టర్లను శుక్రవారం ఖమ్మంలో ఆవిష్కరించగా స్వేరో రాష్ట్ర అధ్యక్షుడు చిలకబత్తిని వీరయ్యతో పాటు దేవరగట్టు బాలప్రసాద్, మొండితోక ఈదయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయానికి
రూ.1.11 లక్షల విరాళం
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి ద్వారకాపురి కాలనీలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి శివ టెంట్హౌస్ నిర్వాహకులు సాధు వసంత్ – సునీత శుక్రవారం రూ.1.11 లక్షలను విరాళంగా అందించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ద్రోణంరాజు మల్లికార్జున శర్మ, వందనపు సత్యనారాయణ, రాగాల చంద్రారెడ్డి, సోమిశెట్టి శ్రీధర్ పాల్గొన్నారు.
లిఫ్ట్లో ఇరుక్కుపోయిన వారిని కాపాడిన పోలీసులు
ఖమ్మంక్రైం: లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ఓ దినపత్రిక జర్నలిస్టులను ట్రాఫిక్ పోలీసు సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. పలువురు జర్నలిస్టులు ఖమ్మం బైపాస్ రోడ్డులోని ఓ అపార్ట్మెంట్కు శుక్రవారం వెళ్లగా.. కిందకు దిగే సమయాన లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. దీంతో వారు టూటౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా, సిబ్బందితో పాటు సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ ప్రసాద్ చేరుకున్నారు. లిఫ్ట్లో సాంకేతిక సమస్య పరిష్కరించేందుకు సాయపడగా అంతా కిందకు దిగడంతో ఊపిరి పీల్చుకుని పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

రేపటి నుంచి రెండురాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు